ఆర్నెల్ల తర్వాత మరో డోసు తీసుకోవాల్సిందే: సైరస్ పూనావాలా
కరోనా వైరస్ నివారణ టీకాల వల్లే సాధ్యం. ఇప్పటికే దేశంలో కోవిషిల్డ్ అందజేస్తున్నారు. అయితే దీనిపై చైర్మన్ సైరస్ పూనావాల స్పందించారు. రెండు డోసులు తీసుకున్న తర్వాత.. యాంటీ బాడీలు తగ్గుతాయని చెప్పారు. ఆరు నెలల తర్వాత మరో డోసు వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. ఇటు కొవిషీల్డ్ వ్యాక్సిన్ ఎగుమతిపై సైరస్ పూనావాల కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశాలకు కొవిషీల్డ్ వ్యాక్సిన్ల ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడంపై పెదవి విరిచారు. ప్రపంచ వ్యాక్సిన్ తయారీ సంస్థగా సీరంను కేంద్రం నిర్ణయం ఇబ్బందుల్లోకి నెట్టేసిందని కామెంట్ చేశారు
లోక్మాన్య అవార్డు తీసుకున్న తర్వాత సైరస్ పూనావాలా మీడియాతో మాట్లాడారు. కొవిషీల్డ్ వ్యాక్సిన్ల ఎగుమతిపై మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయం చాలా మంచిది కాదన్నారు. తన కుమారుడు, సంస్థ సీఈవో అదార్ పూనావాలా ఈ విషయమై నోరు మెదపొద్దన్నాడని చెప్పారు. వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఎగుమతులను అనుమతించాల్సిందేనన్నారు.
సీరం ఇన్స్ట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్పై ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా దేశాలు ఆధారపడి ఉన్నాయి. కీలక సమయంలో వ్యాక్సిన్ల సరఫరాను నిలిపివేసిందని ఆయా దేశాల ప్రభుత్వాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ దేశాలన్నీ ముందస్తుగానే వ్యాక్సిన్ కోసం సీరం ఇన్స్టిట్యూట్కు రూ.కోట్లలో అడ్వాన్స్ చెల్లించాయి.
కొవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీకి బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ కలిపి రూ.5000 కోట్లు ఇచ్చాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్, డబ్ల్యూహెచ్వోలకు డబ్బు వెనక్కు ఇచ్చేందుకు సిద్ధ పడినట్లు సైరస్ పూనావాలా చెప్పారు. కానీ ఆ సంస్థలు తన ప్రతిపాదనను నిరాకరించాయని వివరించారు. త్వరలో కొవిషీల్డ్ ఎగుమతిపై కేంద్రం నిషేధం ఎత్తివేస్తుందని ఆ సంస్థలు ఆశాభావం వ్యక్తం చేశాయన్నారు.
ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
Recommended Video
వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం అయితే ప్రకటించలేదు. డిసిషన్ తీసుకోవాల్సి ఉంది.