ఒక్కో మెట్టు డౌన్: మోదీతో ట్రంప్ భేటీ- లొకేషన్ ఛేంజ్..!!
ఇష్టానుసారంగా టారిఫ్ ను విధించి భారత్ తో గొడవలకు తెర తీసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఒక్కో మెట్టు దిగుతూ వస్తోన్నారు. రష్యాను క్రూడాయిల్ ను కొనుగోలు చేస్తోందనే కారణంతో భారత్ పై నిప్పులు చెరిగిన ఆయన పూర్తిగా యూటర్న్ తీసుకున్నారు. తన వైఖరిని మార్చుకున్నారు. భారత్ తో స్నేహ సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి తనవంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
మొన్నటికి మొన్న పుట్టినరోజును పురస్కరించుకుని ప్రధాని మోదీకి ఫోన్ చేశారు ట్రంప్. బర్త్ డే విషెస్ తెలియజేశారు. మోదీని గ్రేట్ ఫ్రెండ్ గా అభివర్ణించారు. ఆయనతో ఫోన్ లో మాట్లాడానని, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశానని గొప్పగా చెప్పుకొన్నారు. రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ముగించడానికి ఎంతగానో ప్రయత్నిస్తోన్నారని ప్రశంసించారు. యూకే పర్యటనలో కూడా మోదీతో తనకు ఉన్న వ్యక్తిగత అనుబంధాన్ని ప్రస్తావించారు.

ఈ పరిణామాల మధ్య మరో అడుగు ముందుకు పడింది. అక్టోబర్ 26-28 తేదీల్లో మలేషియాలో జరగనున్న ఆసియాన్ సదస్సు సందర్భంగా మోదీతో డొనాల్డ్ ట్రంప్ భేటీ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పుడు అందరి దృష్టి దీని మీదే నిలిచింది ఈ సదస్సుకు ట్రంప్ తో ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతుండటంతో, వారి మధ్య ముఖాముఖి సమావేశం జరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు మోదీ గానీ, ట్రంప్ గానీ ఆసియాన్ సదస్సు పర్యటనల గురించి అధికారికంగా ప్రకటించలేదు.
ఆసియాన్ సదస్సులకు మోదీ క్రమం తప్పకుండా హాజరవుతూ వస్తోన్నారు. గత ఏడాది కూడా ఆయన ఈ సమ్మిట్ లో పాల్గొన్నారు. ఈ ఏడాది కూడా హాజరవుతారని భావిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ పర్యటన మాత్రం దాదాపుగా ఖరారైంది. వచ్చే నెలలో డొనాల్డ్ ట్రంప్ మలేసియాను సందర్శిస్తారని ఆ దేశ ప్రధాని డాతుక్ సేరి అన్వర్ ఇబ్రహీం ధృవీకరించారు కూడా. ఈ సదస్సుకు చైనా ప్రధాని లీ చియాంగ్ కూడా హాజరుకానున్నారు.












Click it and Unblock the Notifications