రాజ్యసభ సభ్యుల కోసమే విభజన బిల్లు సవరణ: వెంకయ్య
న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యులకు జరిగిన అన్యాయాన్ని సరిచేసేందుకే విభజన చట్టాన్ని సవరించాలని భావిస్తున్నట్లు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. విభజన చట్టం సవరణకు ప్రత్యేక ప్రతిపత్తికి సంబంధం లేదని ఆయన అన్నారు. రాజ్యసభ సభ్యులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని, శాసనమండలి సభ్యుల సంఖ్య విషయంలో తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ఆయన వెల్లడించారు.
కొంతమంది దాన్ని మొండిగా వ్యతిరేకించడమే కాకుండా దురుద్దేశంతో ఆపాదిస్తున్నారని వెంకయ్య నాయుడు విమర్శించారు. వాళ్లకు ఇష్టం లేకపోతే ఎవరూ బలవంతం చేయరని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ప్రభుత్వం కూడా బలవంతం చేయదని అన్నారు. ఇలాగే ఇబ్బంది పడాలి... తెలంగాణ ఎంపీలు ఆంధ్రాలో... ఆంధ్రాలో ఎంపీలు తెలంగాణలో ఉండాలని.. అలాగే శాసనమండలిలో ప్రముఖ స్థానం తెలంగాణ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లభించకూడదనే ఉద్దేశం అయితే వాళ్లను అలాగే ఉండవచ్చునని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.
రాష్ట్ర విభజనలో తెలంగాణకు చెందిన కొంత మంది రాజ్యసభల కేటాయింపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొంత మంది సభ్యుల కేటాయింపు తెలంగాణకు జరిగింది. దీంతో ఎంపి ల్యాడ్స్ నిధులను రాజ్యసభ సభ్యులు తమ తమ ప్రాంతాల్లో ఖర్చు పెట్టుకోలేని స్థితి ఉంది. దీంతో ఏ రాష్ట్రానికి చెందిన రాజ్యసభ సభ్యులు ఆ రాష్ట్రానికి వెళ్లే విధంగా విభజన బిల్లును సవరించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. అదే విషయాన్ని వెంకయ్య నాయుడు చెప్పారు.
కాగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ప్ర్తత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదని అంటున్నారు. ఆ రెండు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలనే ప్రభుత్వ యోచనను దేశంలోని ఐదు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. తమిళనాడు, బీహర్ వంటి రాష్ట్రాలు అందుకు వ్యతిరేకంగా ఉన్నాయి. తమకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని బీహార్ వంటి రాష్ట్రాలు కోరుతున్నాయి. దీంతో కొత్తగా ఏర్పడిన తెలంగాణ, ఎపి రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని అంటున్నారు.