బులంద్ షహర్ అల్లర్లు: ఇన్స్పెక్టర్ సుబోధ్ కుమార్ను కాల్చింది ఈ ఆర్మీ జవానే..?
ఉత్తర్ ప్రదేశ్లోని బులంద్ షెహర్ హింసాత్మక ఘటనపై ఆ రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఏడీజీ నివేదిక ఇచ్చిన కొన్ని గంటల్లోనే మరో వ్యక్తి పై పోలీసులు అనుమానిస్తున్నారు. కార్గిల్లో ఆర్మీ జవానుగా పనిచేస్తున్న జీతు ఫౌజీ అనే వ్యక్తి అల్లర్లు జరిగిన గుంపులో ఉన్నాడని ఆయనే కాల్పులు జరిపి ఉండొచ్చనే అనుమానం అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జమ్ము కశ్మీర్లో జీతు ఫౌజీ ఎక్కడున్నాడో వెతికి పట్టుకునేందుకు పోలీసులు వెళ్లారు.
సుబోధ్ కుమార్ సింగ్పై కాల్పులు జరిపింది ఆర్మీ జవాన్ జీతు ఫౌజీనేనా అనే కోణంలో అధికారులు విచారణ చేస్తున్నారు. అల్లర్లు జరిగిన సమయంలో తీసిన వీడియోను చూస్తే అందులో జీతు ఫౌజీ పోలికలతో ఉండే వ్యక్తితో పోలీసు అధికారి సుబోధ్ సింగ్ కుమార్ మాట్లాడుతున్నట్లు కనిపించింది. అదే సమయంలో అధికారి మృతి చెందారు. అయితే మరికొన్ని వీడియోల్లో కూడా అదే పోలికలతో ఉన్న వ్యక్తి అల్లరి గుంపులో ఉన్నట్లుగా కనిపిస్తోంది. అయితే అల్లర్లు జరిగిన సమయంలో తను గ్రామంలోనే ఉన్నాడని జీతు ఫౌజీ కుటుంబ సభ్యులు ధృవీకరించారు. అదే రోజు సాయంత్రం తాను కశ్మీర్కు వెళ్లినట్లు చెప్పారు.
వీడియోలోని అల్లరి గుంపులో ఉన్న వ్యక్తి జీతునా కాదా అనేది తను కచ్చితంగా చెప్పలేకున్నానని జీతు తల్లి రతన్ కౌర్ తెలిపారు. ఒకవేళ నిజంగా పోలీసు అధికారి సుబోధ్ కుమార్ సింగ్ను జీతు కాల్చి చంపేసి ఉంటే తనను కచ్చితంగా శిక్షించాల్సిందే అని ఆమె అన్నారు. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. గోవు కళేబరం ఒక గ్రామంలో దొరకడంతో అల్లర్లు మొదలయ్యాయి. పోలీసు అధికారిని కొట్టండి అంటూ అల్లరి మూకలు గట్టిగా కేకలు వేస్తున్న వీడియో ఒకటి బయటపడింది. ఈ క్రమంలోనే సుబోధ్ కుమార్ సింగ్ను కాల్చి చంపి ఉంటారనే అనుమానం వ్యక్తం అవుతోంది.