కశ్మీరీలకు నేడే నిజమైన దీపావళి : కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ : 370 రద్దుపై కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. ఆర్థికల్ 370 రద్దు చేయడం ఒకరికి వ్యతిరేకం, మరొకరికి లాభం కాదని చెప్పారు. కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. లేనిది ఉన్నట్టు కామెంట్లు చేస్తున్నారని ఫైరయ్యారు. అది సరికాదని .. వారు తమ వైఖరి మార్చుకోవాలని సూచించారు. కశ్మీర్ ప్రజలకు నేడే నిజమైన దీపావళి అని అభివర్ణించారు.
కశ్మీర్కు 370 ఆర్టికల్ రద్దుతో అక్కడి ప్రజలు స్వేచ్చ వాయువులు పీలుస్తారని పేర్కొన్నారు. నేటితో కశ్మీర్ దేశంలో అంతర్భాగమైందని పేర్కొన్నారు. ఇది కశ్మీర్ ప్రజలకే కాదు .. యావత్ దేశ ప్రజలకు కూడా నిజమైన దీపావళి అని పేర్కొన్నారు. మిరుమిట్లు గొలిపే విద్యుత్ ధగధగలతో ప్రజలంతా పండుగ చేసుకుంటున్నారని పేర్కొన్నారు. కశ్మీర్ ప్రజల జీవితాల్లో ఆగస్టు 5 చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. వారు ఈ తేదీని ఎన్నడూ మరచిపోలేరన్నారు. ఇకనుంచి దేశాభివృద్ధిలో జమ్ముకశ్మీర్ కూడా భాగస్వాములైందని పేర్కొన్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రజలంతా ఆనందపడే సమయమిది అని చెప్పుకొచ్చారు. 370 ఆర్టికల్ రద్దుకు మరో అడుగుదూరంలో ఉన్నామన్నారు. లోక్ సభలో ఆమోదం తర్వాత రాష్ట్రపతి రాజమద్రతో కశ్మీర్ దేశంలో అంతర్భాగం అవుతుందున్నారు. దీంతో ఎవరికీ ఇబ్బందులు ఉండవని స్పష్టంచేశారు.

ఆమోదం పొందింది ఇలా
జమ్ము కశ్మీర్ రాష్ట్ర విభజన బిల్లుకు పెద్దల సభ రాజ్యసభ ఆమోదం తెలిపింది. కశ్మీర్కు ఉన్న స్వయం ప్రతిపత్తిని ఇవాళ ఉదయం కేంద్ర ప్రభుత్వం రద్దుచేసిన సంగతి తెలిసిందే. తర్వాత 4 బిల్లులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. కశ్మీర్ రాష్ట్ర విభజన బిల్లుపై చర్చ చేపట్టి .. ఆమోదించారు. మూజువాణి ఓటుతో కాకుండా డివిజ్ పద్ధతిలో ఓటింగ్ జరిగింది. మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదింపజేయాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు భావించగా .. డివిజన్ పద్ధతిలో ఓటింగుకు సభ్యులు పట్టుబట్టారు. మధ్యలో కొద్దిసేపు సాంకేతిక సమస్య వచ్చింది. దీంతో స్లిప్పుల ద్వారా ఓట్లను లెక్కించారు. బిల్లు ఆమోదం పొందే సమయంలో సభలో 191 మంది సభ్యులు ఉన్నారు. కశ్మీర్ విభజన బిల్లుకు 125 మంది మద్దతు తెలిపారు. ఎన్డీఏ సహా మిత్రపక్షాలు కూడా మద్దతు తెలిపాయి. వ్యతిరేకంగా 61 ఓట్లు వచ్చాయి. అయితే సభలో ఉన్న మరో సభ్యుడు ఎవరికీ ఓటేయక .. తటస్థంగా ఉండిపోయారు.












Click it and Unblock the Notifications