ఆప్ లో చేరొద్దు-బీజేపీలోనే ఉంటూ కోవర్టులుగా పనిచేయండి- కేజ్రివాల్ సూచన
ఈ ఏడాది జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది. అక్కడ వరుసగా ఐదుసార్లు అధికారంలో ఉన్న బీజేపీపై వ్యతిరేకత దృష్ట్యా ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని భావిస్తున్న ఆప్ గుజరాత్ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఇదే క్రమంలో భారీ హామీలు ఇవ్వడంతో పాటు బీజేపీ శ్రేణుల మనోధైర్యం దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోంది.
ఎన్నికల నేపథ్యంలో గుజరాత్లో తన పర్యటన చివరి రోజున.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కాషాయ పార్టీని టార్గెట్ చేశారు. బీజేపీ కార్యకర్తలు ఆ పార్టీని విడిచిపెట్టకుండా 'లోపల నుండి' తమ పార్టీ కోసం పని చేయాలని కేజ్రివాల్ విజ్ఞప్తి చేశారు. బీజేపీ కార్యకర్తలు బిజెపి నుండి డబ్బులు తీసుకుంటూనే ఆప్ కోసం లోపల నుంచి పని చేయాలని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజలకు తాను ఇచ్చిన హామీలన్నింటినీ బీజేపీ కార్యకర్తలు లబ్ధి పొందుతారని అన్నారు.
తమకు బీజేపీ నాయకులు వద్దని, బీజేపీ తన నాయకులను ఉంచుకోవచ్చని కేజ్రివాల్ సూచించారు. బీజేపీకి చెందిన 'పన్నా ప్రముఖులు', గ్రామాలు, బూత్లు,తాలూకాలలో కార్యకర్తలు ఆప్ లో తండోపతండాలుగా చేరుతున్నారని, ఇన్నేళ్ల తర్వాత కూడా పార్టీలో ఉన్నా వారి సేవకు ప్రతిఫలంగా బీజేపీ ఏమి ఇచ్చిందని కేజ్రివాల్ ప్రశ్నించారు. కాబట్టి బీజేపీ కార్యకర్తలు ఆ పార్టీలో ఉంటూనే ఆప్ గెలుపు కోసం పనిచేయొచ్చని కేజ్రివాల్ సూచించారు. వారిలో చాలా మందికి బీజేపీ జీతమిస్తోందని, కాబట్టి అక్కడ నుండి డబ్బులు తీసుకోవాలని కోరారు. కానీ తమ వద్ద డబ్బు లేదు కాబట్టి తమ కోసం పని చేయాలని కేజ్రివాల్ కోరారు.