కాసేపట్లో కేజ్రివాల్ అగ్నిపరీక్ష- ఢిల్లీ అసెంబ్లీలో బల ప్రదర్శన-బీజేపీ పరువు తీసే ప్లాన్
ఢిల్లీలో మద్యం కుంభకోణం పేరుతో ఆప్ సర్కార్ ను అస్ధిరం చేసేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు కౌంటర్ గా సీఎం అరవింద్ కేజ్రివాల్ ఇవాళ ఢిల్లీ అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహిస్తున్నారు. పూర్తి మెజారిటీతో ఢిల్లీ అసెంబ్లీలో బలంగా ఉన్న కేజ్రివాల్ సర్కార్ కు ఆప్ ఎమ్మెల్యేల్ని దూరం చేసేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. తాజాగా మద్యం స్కాం పేరుతో బీజేపీ హంగామా మొదలుపెట్టిన తర్వాత ఆప్ ఎమ్మెల్యేలు కొందరు కేజ్రివాల్ ఫోన్లకు స్పందించలేదు. దీంతో అసెంబ్లీలోనే ఈ వ్యవహారం తేల్చేయాలని ఆయన నిర్ణయించారు.
తన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేల్ని ఆకర్షించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని తాజాగా ఆరోపణలు చేసిన కేజ్రివాల్.. ఢిల్లీ అసెంబ్లీలో బలపరీక్ష రూపంలో బీజేపీకి చెక్ పెట్టాలని భావిస్తున్నారు. తద్వారా ఎమ్మెల్యేల్లోనూ విశ్వాసం నింపాలనేది కేజ్రివాల్ వ్యూహంగా కనిపిస్తోంది. కేజ్రివాల్ సర్కార్ ఇవాళ బలపరీక్ష నిర్వహించేందుకు వీలుగా ఢిల్లీ అసెంబ్లీ ఒక్కరోజు ప్రత్యేక సమావేశం నిర్వహిస్తోంది.
ఉదయం 11 గంటలకు బలపరీక్ష కోసం తీర్మానం ప్రవేశపెట్టేందుకు కేజ్రివాల్ సిద్దమవుతున్నారు. ఆప్ ప్రభుత్వం తన పార్టీ ఎమ్మెల్యేలు తమతో పాటే ఉన్నారని నిరూపించేందుకు దీన్ని నిర్వహిస్తోంది. 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్కు 62 మంది ఎమ్మెల్యేలు ఉండగా, బీజేపీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. గతవారం కేజ్రీవాల్ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ 'సీరియల్ కిల్లర్' లాంటిదన్నారు. పార్టీ ఫిరాయించేందుకు పలువురు ఆప్ ఎమ్మెల్యేలకు రూ.20 కోట్లు ఆఫర్ చేయడం ద్వారా ఢిల్లీలోని తన ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు బీజేపీ పన్నాగం పన్నిందని, అందుకే తమ నేతలపై సీబీఐ, ఈడీ కేసులు పెట్టిందన్నారు. ఆరోపించారు.'బీజేపీ ఆపరేషన్ కమలం ఢిల్లీ' కాస్తా 'ఆపరేషన్ కిచడ్'గా మారిందని ఢిల్లీ ప్రజల ముందు రుజువు చేసేందుకు వీలుగా అసెంబ్లీలో విశ్వాస తీర్మానం తీసుకురావాలనుకుంటున్నాను'' అని కేజ్రీవాల్ చెప్పారు.