ఒక్కో ఎమ్మేల్యేకి రూ. 20 కోట్లు ఇచ్చి..: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: న్యూఢిల్లీలో అసెంబ్లీని రద్దు చేసి కొత్తగా ఎన్నికలకు ఆదేశించాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మేల్యేలు ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీని కోరారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని 22 ఎమ్మేల్యేల బృందం రాష్ట్రపతి భవన్లో ప్రణబ్ ముఖర్జీని శనివారం కలిశారు.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ భారతీయ జనతా పార్టీని లెప్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆహ్వానించకుండా జోక్యం చేసుకోవాలని రాష్టపతిని కోరారు. ఈ మేరకు రాష్టపతికి వినతిపత్రం సమర్పించారు. ఆ తర్వాత కేజ్రీవాల్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన శాసనసభ్యుల సంఖ్య భాజపాకు లేదని, ఎమ్మేల్యేలు కొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని అన్నారు.
మా పార్టీకి చెందిన ఒక్కో ఎమ్మేల్యేను రూ. 20 కోట్లు ఇచ్చి కొనాలనుకుంటుందని ఆరోపించారు. ఐతే ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణల్ని భాజపా నేత, కేంద్ర హొం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఖండించారు. గవర్నర్ నుండి ఎలాంటి అధికారిక ప్రతిపాదన వచ్చినా... తమ పార్టీ వెంటనే సమావేశమవుతుందన్నారు.