నమ్మండి, కోర్టుల జోక్యం వద్దు: కరోనా వ్యాక్సిన్ పాలసీపై సుప్రీంకోర్టుకు కేంద్రం వివరణ
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ ధరలు, కరోనా వ్యాక్సినేషన్ విధానంపై సుప్రీంకోర్టులో కేంద్రం తన వాదనలను వినిపించింది. అంతేగాక, వ్యాక్సిన్ పాలసీపై తన వాదనను సమర్థించుకుంది. తమపై నమ్మకం ఉంచాలని, ఈ విషయంలో జోక్యం చేసుకోకూడదని సుప్రీంకోర్టుకు విన్నవించింది.
Recommended Video

టీకా విధానంలో న్యాయవ్యవస్థ జోక్యం వద్దు..
ప్రస్తుతం కరోనా మహమ్మారి సంక్షోభ సమయంలో ప్రజాప్రయోజనాల దృష్ట్యా నిపుణలు, శాస్త్రీయ సలహాలతో టీకా విధానాన్ని రూపొందించామని సుప్రీంకోర్టుకు తెలిపింది. ప్రజా ప్రయోజనాల నిర్ణయాల్లో న్యాయ వ్యవస్థ జోక్యం తగదని స్పష్టం చేసింది. ఈ మేరకు 208 పేజీల అఫిడవిట్ను సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసింది.
కరోనా వ్యాక్సిన్ విధానంతోపాటు కరోనా నిర్వహణపై కేంద్ర ఇందులో వివరించింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న పరిస్థితుల్లో దేశం అవలంభిస్తున్న విధానాలు, వ్యూహాలు పూర్తిగా వైద్య నిపుణులు, శాస్త్రీయ సలహాలతో చేపడుతున్నవేనని పేర్కొంది. వీటిలో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవడం తగదని స్పష్టం చేసింది. అలా చేస్తే మునుపెన్నడూ చూడని అనాలోచిత పరిణామాలను చూడాల్సి వస్తుందని కేంద్రం తన అఫిడవిట్లో వివరించింది.

విదేశీ టీకా తయారీదారులను ఆకర్షించే అవకాశం..
దేశంలో కరోనా వ్యాక్సిన్ ధరలు సహేతుకమేనని, దేశమంతటా ఒకే ధరలు ఉన్నాయని పేర్కొంది. పోటీతత్వ మార్కెట్ ఏర్పాటు, ప్రైవేటు వ్యాక్సిన్ తయారీదారులకు ప్రోత్సాహక డిమాండ్ను సృష్టించే పద్ధతిలో భాగంగానే టీకా ధరల్లోనే వ్యత్యాసాలు ఉన్నట్లు పేర్కొంది. ఈ విధానం ద్వారా ఉత్పత్తి పెరగడంతోపాటు విదేశీ టీకా తయారీదారులు కూడా దేశంలోకి ప్రవేశించేందుకు ఆసక్తి చూపుతారని తెలిపింది.

దేశంలో ఉచితంగానే కరోనా వ్యాక్సిన్లు..
అయితే, ధరలు ఎలా ఉన్నా దేశ వ్యాప్తంగా అందరికీ ఉచితంగానే వ్యాక్సిన్ అందుతోందని కేంద్రం వివరించింది. 18-45ఏల్ల మధ్య వయస్కులకు అనేక రాష్ట్రాలు ఉచిత టీకాలు ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా కేంద్రం ప్రస్తావించింది. ఇక కరోనా నిర్వహణ గురించి వివరిస్తూ.. కరోనా బాధితులు దేశంలో ఎక్కడైనా చికిత్స తీసుకునే వెసులుబాటు కల్పిస్తూ జాతీయ విధానంలో మార్పులు చేసినట్లు తెలిపింది.
కరోనా కేంద్రాలు, పడకలు, సిబ్బందిని పెంచామని, వైద్య విద్యార్థులను కూడా కరోనా సేవల్లో భాగస్వాములను చేసినట్లు కేంద్రం కోర్టుకు వివరించింది. దేశంలో కరోనా పరిస్థితులు, నిర్వహణ, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనున్న నేపథ్యంలో కోర్టు నోటీసులపై కేంద్ర ప్రభుత్వం ఆదివారం అర్ధరాత్రి ఈ అఫిడవిట్ దాఖలు చేసింది.












Click it and Unblock the Notifications