బిగ్ షాక్ : బ్యాంకుల ద్వారా 19లక్షల నకిలీ నోట్లు చలామణిలోకి..
గడిచిన మూడున్నరేళ్లలో ఏకంగా 19 లక్షల నకిలీ నోట్లు బ్యాంకుల ద్వారానే చలామణిలోకి వచ్చినట్టు ఆర్బీఐ నివేదిక ద్వారా వెల్లడైంది.
బెంగుళూరు : దేశంలో నకిలీ నోట్లను, నల్లకుబేరుల ఆగడాలను అరికట్టాలన్న ఆలోచనలో భాగంగా.. కేంద్రం నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. దేశంలో నకిలీ నోట్లకు సంబంధించి పలు షాకింగ్ విషయాలు వెలుగుచూస్తున్నాయి. గడిచిన మూడున్నరేళ్లలో ఏకంగా 19 లక్షల నకిలీ నోట్లు బ్యాంకుల ద్వారానే చలామణిలోకి వచ్చినట్టు వెల్లడైంది.
అదే సమయంలో ఏటీఎంల ద్వారా రూ.14.97 కోట్ల భారీ నకిలీ నోట్లు చలామణిలోకి వచ్చినట్టుగారిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా తమ నివేదికలో పేర్కొంది. ఇందులో రూ.54.21కోట్ల విలువ చేసే 5.42 లక్షల నకిలీ వంద నోట్లు ఉన్నట్టు తేలింది. రూ.42.8 కోట్ల విలువ చేసే 8.56 లక్షల 500 రూపాయల నకిలీ నోట్లు చలామణి అయినట్టుగా నిర్దారించారు. రూ.47 కోట్ల విలువచేసే 4.7 లక్షల రూ.1000 నకిలీ నోట్లను చలామణిలోకి తీసుకొచ్చాయని నివేదిక ద్వారా వెల్లడైంది.
ఐటీ ఎంప్లాయ్ కు ఏటీఎం ద్వారా నకిలీ నోట్లు :
బెంగుళూరులోని ఓ ఏటీఎం ద్వారా డబ్బులు డ్రా చేసుకున్న రాజు అనే ఓ స్థానిక ఐటీ ఉద్యోగికి నకిలీ నోట్లు వచ్చాయి. రాజు ఐదువేల రూపాయాలు డ్రా చేసుకోగా.. అందులో 9 నకిలీ నోట్లు ఉన్నట్టుగా తేలింది. బెల్గాం వెళ్లేందుకు రైలు టికెట్ తీసుకుంటున్న సందర్బంలో.. ఆ నోట్లను నకిలీ నోట్లుగా అక్కడి అధికారులు గుర్తించారు.
దీంతో విషయాన్ని తీవ్రంగా తీసుకున్న పోలీసులు.. నకిలీ నోట్ల చలామణిపై కూపీ లాగే ప్రయత్నం చేస్తున్నారు.
ఆర్బీఐ నిబంధనలు పట్టవా? :
వాస్తవానికి ఏటీఎంలలో డబ్బు పెట్టేముందు.. ఆ నోట్లు అసలువా? నకిలీవా? అన్నది సదరు ఏటీఎం సంబంధిత అధికారులు చెక్ చేసుకోవాలని ఆర్బీఐ నిబంధనలు చెబుతున్నాయి. కానీ చాలామట్టుకు ఏటీఎంల వద్ద ఇలాంటి పరిస్థితి కనిపించడం లేదు.సిబ్బంది కొరతను సాకుగా చూపుతూ.. నోట్లను తనిఖీ చేయకుండానే ఏటీఎంలలో పెట్టేస్తుండడంతో.. నకిలీ నోట్లు డ్రా చేసుకున్న ప్రజలు ఏటీఎం సిబ్బంది పనితీరుపై మండిపడుతున్నారు.