సీటీ స్కాన్తో క్యాన్సర్ వచ్చే ప్రమాదం... కోవిడ్ పేషెంట్లకు ఎయిమ్స్ డైరెక్టర్ హెచ్చరిక...
కోవిడ్ స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న పేషెంట్లకు సీటీ స్కాన్ అవసరం లేదని... చీటికి మాటికీ సీటీ స్కాన్ చేయించుకుంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందని డా.రణదీప్ గులేరియా సంచలన వ్యాఖ్యలు చేశారు. సీటీ స్కాన్ ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని... అవి క్యాన్సర్కు దారితీసే అవకాశం ఉంటుందని అన్నారు.
స్వల్ప లక్షణాలు కలిగిన పేషెంట్లు పదే పదే సీటీ స్కానింగ్కి వెళ్లడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉంటుందన్నారు. 'సీటీ స్కాన్,బయోమార్కర్స్ను చాలావరకు దుర్వినియోగం చేస్తున్నారు. స్వల్ప లక్షణాలు ఉన్నవారు సీటీ స్కాన్ చేయించుకోవడం వల్ల ఉపయోగమేమీ లేదు. పైగా ఒక్క సీటీ స్కాన్ 300 ఛాతి ఎక్స్రేలతో సమానం... అది చాలా ప్రమాదకరం..' అని పేర్కొన్నారు.
వ్యాధి తీవ్రతను పరీక్షించేందుకు,శరీరం చికిత్సకు స్పందిస్తుందా లేదా అని చూసేందుకు బయోమార్కర్స్ ఉపయోగిస్తారు. అయితే బయోమార్కర్స్ హానికరమని డా.గులేరియా హెచ్చరించారు.
అసింప్టమాటిక్ అయిన దాదాపు 30-40శాతం కోవిడ్ పేషెంట్లు సీటీ స్కాన్ చేయించుకుంటున్నట్లు పలు అధ్యయనాల్లో వెల్లడైందని తెలిపారు. ఎవరికైనా కరోనా సోకిందేమోనన్న అనుమానం ఉంటే... మొదట చెస్ట్ ఎక్స్రే తీసుకోవాలన్నారు. సీటీ స్కాన్ అవసరమైతే వైద్యుడే సలహా ఇస్తారని తెలిపారు.
కోవిడ్ పాజిటివ్గా తేలినవారు రక్త పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదన్నారు. సీపీసీ లేదా ఎల్డీహెచ్ వంటి పరీక్షలు అనవసర భయాందోళన కలిగిస్తాయన్నారు. కరోనా లక్షణాలు లేనివారు హోం ఐసోలేషన్లో ఉండి కోలుకోవచ్చన్నారు. వైద్యుల సూచనల మేరకు మాత్రమే రోగులు మందులు వాడాలని గులేరియా తెలిపారు.
కోవిడ్ ప్రారంభ దశలో అతిగా స్టెరాయిడ్స్ తీసుకుంటే అది ఊపిరితిత్తులపై దుష్ప్రభావం చూపించవచ్చు అన్నారు. దానివల్ల న్యుమోనియా తీవ్రమయ్యే ప్రమాదం ఉందన్నారు. కాబట్టి స్వల్ప లక్షణాలు ఉన్న పేషెంట్లు సాధారణ మందులు వాడితే సరిపోతుందని... స్టెరాయిడ్స్ అవసరం లేదని వెల్లడించారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటేనే స్టెరాయిడ్స్ అవసరం ఉంటుందన్నారు.
Recommended Video