బాబ్రీ మసీదు విధ్వంసం: అద్వానీని మళ్లీ విచారించాల్సిందేనంటున్న సీబీఐ..
అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతి సహా 14 మంది కుట్ర ఆరోపణలు ఎదుర్కోవాల్సిందేనని సీబీఐ సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసు అద్వానీని వెంటాడుతోంది. కేసులో అద్వానీ సహా మరో 14మందిని పునర్విచారణ చేయడానికి అనుమతించాలని సుప్రీంకోర్టును సీబీఐ ఆశ్రయించింది. దీనిపై సుప్రీం కోర్టు నేడు విచారణ జరపగా.. ఇరుపక్షాలు తమ వాదన వినిపించాయి.
అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతి సహా 14 మంది కుట్ర ఆరోపణలు ఎదుర్కోవాల్సిందేనని సీబీఐ సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది. బాబ్రీ కోసులో లక్నో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును పునర్విచారణ జరిపించాలని సీబీఐ తరుపు న్యాయవాది సుప్రీం ధర్మాసనాన్ని కోరారు. కేసుకు సంబంధించి ఇప్పటివరకు 195మంది సాక్షులను సీబీఐ విచారించిందని, మరో 300మందిని విచారించాల్సి ఉందని తెలిపారు.
ఇదే అంశంపై రాయ్ బరేలీ కోర్టులోను విచారణ జరగా 57మంది సాక్ష్యులను విచారించామని, మరో 100మందిని విచారించాల్సి ఉందని తెలిపినట్లు సమాచారం. కాగా, 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత వెనుక బీజేపీ నేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతి సహా పలువురు సీనియర్ నేతలు కుట్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఈ అభియోగంపై విచారణ చేపట్టిన లక్నో ట్రయల్ కోర్టు పిటిషన్ కొట్టివేసింది. అలహాబాద్ హైకోర్టు సైతం కింది కోర్టు తీర్పును సమర్థించడంతో.. సీబీఐ సుప్రీంలో ఈ తీర్పును సవాల్ చేసింది.