తల్లి మృతి... 2 రోజులుగా శవం పక్కనే 18 నెలల చిన్నారి... కరోనా వేళ గుండెలను పిండే విషాదం...
మాటలకు అందని విషాదం... హృదయం ముక్కలయ్యే వేదన... కరోనా సృష్టిస్తోన్న విషాదపు ఉత్పాతం ఎన్నో గుండెలకు తీరని కోత... దేశంలో కరోనా సెకండ్ వేవ్ కమ్ముకున్న వేళ ఎటుచూసినా విషాద దృశ్యాలే... పేగు బంధాలను,ఆత్మీయ బంధాలను కరోనా బలిపెడుతోంది.కరోనా సోకితే అయినవాళ్లూ దూరమయ్యే పరిస్థితి... కొన్నిసార్లు కరోనా సోకిందేమోనన్న అనుమానం కూడా అమానవీయ,విషాద ఘటనలకు దారితీస్తోంది. తాజాగా మహారాష్ట్రలోనూ ఇలాంటి తరహా ఘటనే చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే... మహారాష్ట్రలోని పింప్రి చించ్వాడ్లో ఓ మహిళ నివసిస్తోంది. ఆమె భర్త బతుకుదెరువు నిమిత్తం ఉత్తరప్రదేశ్లో ఉంటూ ఏదో పనిచేస్తున్నాడు.వీరికి 18 ఏళ్ల కుమారుడు. ఏమైందో ఏమో తెలియదు గానీ గత శనివారం(ఏప్రిల్ 24) ఇంట్లోనే ఆమె మృతి చెందింది. భర్త ఇంట్లో లేకపోవడం,బంధువులెవరూ పట్టించుకోకపోవడంతో ఆ మహిళ చనిపోయిన విషయం రెండు రోజులకు గానీ ఎవరికీ తెలియలేదు.

సోమవారం(ఏప్రిల్ 26) ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఆమె చనిపోయినట్లుగా చుట్టుపక్కలవారు గుర్తించారు. అయితే ఆమె కరోనాతో చనిపోయిందేమోనన్న అనుమానంతో ఎవరూ ఆ ఇంట్లోకి వెళ్లే సాహసం చేయలేదు. ఆమె శవం పక్కనే రెండు రోజులుగా 18 నెలల ఆమె కొడుకు ఆకలితో అలమటిస్తూ ఏడుస్తున్నాడు. తల్లి చనిపోయిందన్న విషయం తెలియక.. పట్టించుకోనేవారు ఎవరూ లేక శవం పక్కనే రెండు రోజులుగా ఏడుస్తూనే ఉన్నాడు.
రెండు రోజుల తర్వాత ఆ ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు అక్కడికి చేరుకుని మొదట ఆ బాలుడిని బయటకు తీసుకొచ్చారు. అతనికి కొన్ని బిస్కెట్లు,ఆహారం ఇచ్చారు. అనంతరం అతని తల్లి మృతదేహాన్ని అక్కడినుంచి పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చిన్నారికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా అతనికి కోవిడ్ నెగటివ్గా నిర్దారణ అయింది.
ఈ ఘటనపై ఆ ఇంటికి వెళ్లిన మహిళా పోలీస్ కానిస్టేబుల్ సుశీలా గభాలే మాట్లాడుతూ... 'నాకూ ఇద్దరు పిల్లలున్నారు. ఒకరికి ఆరేళ్లు,మరొకరికి ఎనిమిదేళ్లు. అందుకే ఆ చిన్నారిని కూడా నా బిడ్డ లాగే భావించాను. ఆకలితో ఉండటంతో ఆ చిన్నారి గబగబా పాలు తాగేశాడు.' అని చెప్పుకొచ్చారు. రెండు రోజులు తల్లి శవం పక్కనే ఏడుస్తూ ఉన్నప్పటికీ... అతని ఆరోగ్యం బాగానే ఉందని,స్వల్ప జ్వరం మాత్రం ఉందని మరో మహిళా కానిస్టేబుల్ రేఖ తెలిపారు.
Recommended Video
'ఆ చిన్నారిని మేము డాక్టర్కు చూపించినప్పుడు స్వల్ప జ్వరంతో బాధపడుతున్నాడు. సరైన ఆహారం అందిస్తే త్వరగా కుదుటపడుతాడని వైద్యులు చెప్పారు. కొన్ని బిస్కెట్లు,ఆహారం ఇచ్చాక అతన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కరోనా టెస్టులు చేయించాం. టెస్టుల్లో నెగటివ్గా తేలింది.' అని రేఖ వెల్లడించారు. మృతురాలి భర్తకు సమాచారం అందించామని... అతను తిరిగి రాగానే ఆ చిన్నారిని అప్పగిస్తామని స్థానిక ఇన్స్పెక్టర్ తెలిపారు.












Click it and Unblock the Notifications