ఉద్యోగులకు టాటా లేఖ, సైరస్ మిస్త్రీని ఎందుకు తప్పించారంటే..!
ముంబై: అందరినీ ఆశ్చర్యపరుస్తూ, టాటా సన్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తొలగించిన అనంతరం తాత్కాలిక చైర్మన్ రతన్ టాటా సోమవారం నాడు కంపెనీ ఉద్యోగులకు లేఖ రాశారు. కంపెనీ స్థిరత్వం కోసం తాను నాలుగు నెలల పాటు తాత్కాలిక చైర్మన్ బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు.
సైరస్ మిస్త్రీని చైర్మన్ పదవి నుంచి తొలగించాలని శుక్రవారం నాడు ముంబైలో జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. మిస్తీని తొలగించిన అనంతరం మధ్యంతర చైర్మన్గా టాటాను న నియమిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.
ఈ నేపథ్యంలో రతన్ టాటా ఉద్యోగులకు లేఖ రాశారు. సైరస్ మిస్త్రీని తొలగించినట్లు పేర్కొన్నారు. తదుపరు టాటా సన్స్ చైర్మన్ను ఎంపిక చేసేందుకు ఓ కమిటీని నియమించినట్లు పేర్కొన్నారు. ఆ కమిటీ నాలుగు నెలల్లో తదుపరి చైర్మన్ను ఎంపిక చేస్తుందన్నారు. రతన్ టాటా డిసెంబర్ 29, 2012లో రిటైర్ అయ్యారు.
సైరస్ మిస్త్రీని ఎందుకు తప్పించారు?
దేశీయ అతిపెద్ద ప్రయివేటు కార్పోరేట్గా పేరుగాంచిన టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తప్పించడం వెనుక కారణాల పైన ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. సైరస్ను తొలగించడానికి గల కారణాలను కంపెనీ వెల్లడించలేదు. ఇది మరింత చర్చకు తావిస్తోంది.
లాభాపేక్ష లేని వ్యాపారాల పైన మిస్త్రీ అశ్రద్ధ వహించడం, వాటి విక్రయాలు జరుపుతూ ఇటీవల పలు నిర్ణయాలు తీసుకోవడంపై ఆయన పైన వేటు పడటానికి కారణాలుగా పలువురు భావిస్తున్నారు. వాటిలో మేజర్ డీల్ యూరప్లో ఉక్కు వ్యాపారాలను విక్రయించడంగా చెబుతున్నారు.
సైరస్ నేతృత్వంలోనే యూరప్లో తమకు ఉన్న యూరప్ లాంగ్ ప్రోడక్ట్స్ ఉక్కు వ్యాపారానని విక్రయించినట్లు టాటా స్టీల్(యూకే) ప్రకటించింది. కేవలం ఆధాయాలపై మాత్రమే శ్రద్ధ వహించడం, లాభాపేక్ష లేని వ్యాపారాల నుంచి వైదొలగడం వంటివి మిస్త్రీ నిర్వహించే వాటిలో టాటా సన్స్కు అసంతృప్తిని కలిగించే అంశాలుగా భావిస్తున్నారు.