బీహార్లో తేజస్వి మేనియా- అచ్చు జగన్లాగే ఒక్క ఛాన్స్-నితీశ్పై ప్రతీకారమే అజెండా...
బీహార్ రాజకీయాల్లో ప్రతీ పదిహేనేళ్లకోసారి రాజకీయం మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. జయప్రకాశ్ నారాయణ్ సోషలిస్టు ఉద్యమం తర్వాత ఆవిర్భవించిన నేతల్లో ఒకరైన లాలూప్రసాద్ యాదవ్ 30 ఏళ్ల క్రితం బీహార్ పగ్గాలు చేపట్టి ఏకధాటిగా మూడు సార్లు అధికార పగ్గాలు అందుకున్నారు. ఆ తర్వాత నితీశ్ హయాం మొదలైంది. ఈయన కూడా జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమంలో నుంచి పుట్టుకొచ్చిన నాయకుడే. లాలూ కుటుంబం అరాచక పాలన నుంచి విసుగెత్తిపోయిన బీహారీలు నితీశ్ను 15 ఏళ్లుగా వరుసగా గెలిపించడం మొదలుపెట్టారు. మూడు పర్యాయాలు అధికార పగ్గాలు అందుకున్న నితీశ్ బాబూ కూడా ఇప్పుడు వారికి బోర్ కొట్టేసినట్లే కనిపిస్తున్నాడు. దీంతో ఆయన ప్రత్యర్ధి తేజస్వీ యాదవ్కు ఒక్క ఛాన్స్ ఇచ్చేందుకు వారు సిద్దమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
Recommended Video

తేజస్వీ ప్రతీకార పంథా...
బీహార్లో 2015లో జరిగిన ప్రతిష్టాత్మక అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్డీయే నుంచి విడిపోయి మహాకూటమితో కలిసి సీఎం పీఠాన్ని అందుకున్న నితీశ్ కుమార్ ఆ తర్వాత కూటమికి వెన్నుపోటు పొడిచారు. అనతికాలంలోనే మహాకూటమి ప్రభుత్వాన్ని కూల్చి తిరిగి ఎన్డీయేతో కలిసి సీఎం అయిపోయారు. నితీశ్పై ఎన్నో ఆశలతో సీఎం పగ్గాలు అప్పజెప్పిన మహాకూటమి నేతలకు ఇదో పరాభవంగా మిగిలిపోయింది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నాలుగేళ్లలో నితీశ్ కుమార్ ప్రజల్లో ఎక్కడ లేని వ్యతిరేకత పెంచుకున్నారు. అదే సమయంలో ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న తేజస్వీ యాదవ్ నితీశ్ను గద్దె దింపేందుకు ఇదే సరైన సమయమని భావించారు. గతంలో మహాకూటమికి నితీశ్ వెన్నుపోటు పొడిచిన విషయాన్ని జనంలోకి గట్టిగా తీసుకెళ్లారు. దాన్ని జనం కూడా గుర్తించినట్లు ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్పకనే చెప్పాయి.

జగన్ లాగే తేజస్వికీ ఒక్క ఛాన్స్...
ఏపీ సీఎం వైఎస్ జగన్ గతంలో సోనియాగాంధీ, చంద్రబాబు కుమ్మక్కు రాజకీయాల్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు. దీన్ని ఏపీ ప్రజలు కూడా విశ్వసించారు. దీంతో జగన్ ఒంటరి కాదని నిరూపించేందుకు రాష్ట్ర ప్రజలంతా ఏకమయ్యారు. ఎన్నడూ లేని విధంగా జగన్కు ఒక్క ఛాన్స్ ఇద్దామని భావించారు. దాని ఫలితమే గతేడాది ఎన్నికల్లో జగన్కు 151 సీట్ల విజయం. ఇప్పుడు అదే తరహాలో బీహార్లోనూ యువ తేజస్వి యాదవ్కు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దామని ఓటర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు అన్ని ఎగ్జిట్పోల్ అంచనాలను గమనిస్తే తేజస్వికి ఒక అవకాశం ఇవ్వడం ద్వారా బీహార్లో ఏదైనా మార్పు వస్తుందేమో చూద్దామన్న ఆలోచన ఓటర్లలో కనిపిస్తోంది. గతంలో 15 ఏళ్ల క్రితం అచ్చు లాలూ కుటుంబ పాలన నుంచి బీహార్ను విముక్తం చేసేందుకు ఇలాగే ఒక్క ఛాన్స్ పేరుతో నితీశ్కు ఓటర్లు బీహార్ పగ్గాలు అప్పగించారు. సరిగ్గా 15 ఏళ్ల తర్వాత తిరిగి ఓటర్లు అదే చేయబోతున్నారా అని అనిపిస్తోంది.

బీహార్ యూత్ను ఆకర్షిస్తున్నతేజస్వీ ప్రతీకారం
గత ఎన్నికల్లో తమతో కలిసి అధికారం సాధించి ఆ తర్వాత ఎన్డీయే పంచన చేరిన నితీశ్ కుమార్పై తేజస్వి రగిలిపోతున్నారు. ఇప్పుడు అదే విషయాన్ని బీహార్లో కీలకమైన యువత మెదళ్లలోకి ఎక్కించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. యువత కూడా దాన్ని బాగానే రిసీవ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మహాకూటమి ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో బీహార్ యువత తేజస్వీ ప్రతీకారాన్ని ఓన్ చేసుకున్నట్లే కనిపిస్తోంది. ఈసారి మహాకూటమిని నడిపిస్తున్న ఆర్జేడీ మరోసారి అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా నిలవబోతుందున్న అంచనాలు కూడా ఇందులో భాగమే. అదే జరిగితే దేశంలోనే యువ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడం ద్వారా తేజస్వీ బీహారీ యువత ప్రతిరూపంగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications