పెళ్లి.. ఆ వరుడికి కాళరాత్రి... ఊహించని షాకిచ్చిన వధువు ఫ్యామిలీ...
ఆ అబ్బాయిది ఉత్తరప్రదేశ్లోని అజంఘర్... అమ్మాయిది మౌ పట్టణం... డిసెంబర్ 10వ తేదీ రాత్రి ఈ ఇద్దరికీ పెళ్లి జరగాల్సి ఉంది. ఆ సాయంత్రం అజంఘర్ నుంచి కుటుంబ సభ్యులు,బంధుమిత్రులతో కలిసి పెళ్లి కొడుకు బరాత్తో ఊరేగింపుగా బయలుదేరాడు. కానీ తీరా మౌకి వెళ్లాక పెళ్లి కూతురి ఇంటి చిరునామా దొరకలేదు.
ఎక్కడో చిన్న పొరపాటు జరిగి ఉంటుందని... వెళ్లిన చోటుకు కాకుండా మరో కాలనీలో ఆ ఇంటి కోసం వెతికారు. అయినా లాభం లేదు... ఓవైపు చలి... మరోవైపు పెళ్లి కూతురు ఇల్లు దొరకట్లేదన్న టెన్షన్... అప్పటిదాకా ఉన్న ఉత్సాహమంతా నీరుగారిపోయింది. రాత్రంతా గల్లీ గల్లీ తిరిగి వెతికినా ఆ చిరునామాతో ఉన్న ఇల్లు దొరకలేదు. దీంతో చేసేది లేక ఆ బరాత్ను వెంటపెట్టుకుని తిరిగి అజంఘర్ వెళ్లిపోయారు.
ఇదీ జరిగిన కథ...
ఉత్తరప్రదేశ్లోని అజంఘర్కి చెందిన ఓ యువకుడికి నాలుగేళ్ల క్రితం బిహార్లోని సమస్తీపూర్కి చెందిన ఓ యువతితో వివాహం జరిగింది. పెళ్లయిన కొన్నాళ్లకు పుట్టింటికి వెళ్లిపోయిన ఆ యువతి మళ్లీ తిరగరాలేదు. దీంతో ఆ యువకుడి తల్లిదండ్రులు అతనికి మరో పెళ్లి చేయాలనుకున్నారు. అలా పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్న క్రమంలో ఓ మహిళ ఓ సంబంధం తీసుకొచ్చింది. యువకుడికి అమ్మాయి ఫోటో నచ్చడంతో సదరు మహిళ ఆ అమ్మాయి కుటుంబంతో మాట్లాడి వారిని పిలిపించింది. ఇరువురి కుటుంబ సభ్యులు నరోలీలోని ఓ షాపులో కలుసుకుని మాట్లాడుకున్నారు. ఇరువురికీ ఓకె కావడంతో సంబంధం ఖాయం చేసుకున్నారు. పెళ్లి గురించి,వేదిక గురించి అన్నీ మాట్లాడేసుకున్నారు.
ఇలా బోల్తా కొట్టారు...
సంబంధమైతే ఖాయం చేసుకున్నారు గానీ ఒకరి ఇంటికి ఒకరు వెళ్లలేదు. అంతా మధ్యవర్తిగా ఉన్న మహిళే చూసుకుంది. డిసెంబర్ 10వ తేదీ రాత్రి పెళ్లి ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. పెళ్లి ఏర్పాట్ల కోసం వరుడి కుటుంబం వధువు కుటుంబానికి రూ.20వేలు డబ్బు కూడా ఇచ్చారు. ఇంతలో పెళ్లి డేట్ రానే వచ్చింది. గురువారం(డిసెంబర్ 10) సాయంత్రం పెళ్లి కొడుకు,అతని కుటుంబం,బంధుమిత్రులంతా కలిసి బరాత్ డ్యాన్సులతో ఊరేగింపుగా మౌ పట్టణంలోని వధువు ఇంటికి బయలుదేరారు. తీరా అక్కడికి వెళ్లాక అమ్మాయి కుటుంబం ఇచ్చిన చిరునామా ఎక్కడా కనిపించలేదు.
ఆ మధ్యవర్తిని చితకబాదారు...
ఓవైపు విపరీతమైన చలిలో వణుకుతూనే ఆ కుటుంబం మౌ పట్టణంలో గల్లీ గల్లీ ఆ ఇంటి కోసం గాలించింది. కానీ ఎక్కడా ఆ చిరునామా కనిపించలేదు. దీంతో ఉత్సాహంగా ఊరేగింపుతో బయలుదేరిన ఆ కుటుంబం ఇక చేసేది లేక ఉసూరుమంటూ అజంఘర్కు వచ్చేసింది. ఆ మరుసటిరోజు మధ్యవర్తిగా వ్యవహరించిన మహిళను పట్టుకుని వరుడి కుటుంబం ఓ గదిలో బంధించి చితకబాదింది. పెళ్లి పేరుతో తమను మోసం చేసిందంటూ కొత్వాలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే ఆ అమ్మాయి కుటుంబం తననే మోసం చేశారని సదరు మహిళ వాపోయింది. చివరకు ఆ మహిళ,ఆ కుటుంబం రాజీకి రావడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో చర్చనీయాంశమైంది.