Bed blocking: బీజేపీ ఎంపీ గుడ్డోడా ? కళ్లు కనపడలేదా ? థర్డ్ క్లాస్ బుద్ది, కాంగ్రెస్ ఎంపీ ఫైర్, ఛీ !
బెంగళూరు: బెడ్ బ్లాకింగ్ స్కామ్ వ్యవహారంలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య గుడ్డిగా, కళ్లు ఉండి కనపడలేని వ్యక్తిగా ప్రవర్థిస్తున్నాడని కాంగ్రెస్ విరుచుకుపడింది. 205 మంది ఉద్యోగుల్లో 17 మంది మీద ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ మిగిలిన వాళ్లకు క్లీన్ చిట్ ఇచ్చేస్తున్నాడు. కోవ్యాక్సిన్, కోవిడ్ రోగుల ఐసీయూ బెడ్ లు కేటాయించే విషయంలో రాజకీయం చేస్తున్న బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ముస్లీంలను టార్గెట్ చేసుకుని వ్యవహరిస్తున్నాడని కాంగ్రెస్ ఎంపీ విరుచుకుపడ్డాడు. అసలు ఈ ఎంపీ ఎవరు ?, అందరికీ క్లీన్ చిట్ ఇవ్వడానికి ఆయన ఏమైనా విచారణ అధికారిగా పని చేస్తున్నారా ?, సిగ్గు మానం మర్యాద ఉంటే ఇలా పబ్లిక్ గా ముస్లీం ఉద్యోగులను టార్గెట్ చేసుకుని విమర్శించడం ఒక ప్రజాప్రతినిధిగా ఆయన మనసు ఎలా వచ్చింది ? ఇది థర్డ్ క్లాస్ బుద్ది, ఇది థర్డ్ క్లాస్ రాజకీయం అంటూ కాంగ్రెస్ ఏంపీ విరుచుకుపడటం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.
బెంగళూరు దక్షిణ విభాగం బీజేపీ ఎంపీ
బెంగళూరు దక్షిణ లోక్ సభ నియోజక వర్గం బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ఇటీవల బీబీఎంపీ పరిధిలో జరుగుతున్న కోవిడ్ బెడ్ బ్లాకింగ్ దందా వ్యవహారం వెలుగులోకి తీసుకురావడంతో కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉలిక్కిపడింది. కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ మీద పరోక్షంగా విరుచుకుపడిన ఆ పార్టీ ఎంపీ బెడ్ బ్లాకింగ్ దంద వ్యవహారం వెలుగులోకి తీసుకు వచ్చి బీబీఎంపీలోని బెడ్ బ్లాకింగ్ కు పాల్పపడుతున్న అవినీతి ఉద్యోగుల మీద కఠిన చర్యులు తీసుకోవాలని బెంగళూరు నగర సిటీ పోలీసు కమీషనర్ కమల్ పంత్ కు ఫిర్యాదు చెయ్యడం కలకలం రేపింది. ఇదే సమయంలో బెడ్ బ్లాకింగ్ కేసులో వివాహిత మహిళతో పాటు కొందరిని పోలీసులు అరెస్టు చేశారు.
17 మంది ముస్లీంల పేర్లు విడుదల
బీబీఎంపీ నిర్వహిస్తున్న కోవిడ్ -19 వార్ రూమ్ సౌత్ జోన్ లో పని చేస్తున్న 17 మంది ఉద్యోగులు బెడ్ బ్లాకింగ్ కు పాల్పుడుతున్నారని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వారి పేర్లను విడుదల చేశారని, ఇది ఓ వర్గాన్ని టార్గెట్ చేసుకోవడమే అంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు (ఎంపీ) సయ్యద్ నసీర్ హుస్సేన్ విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మీద విరుచుకుపడ్డారు.
177 మంది సాఛాలా ? క్లీన్ చిట్ ఇవ్వడానికి ఈయన ఎవరు
బీబీఎంపీ సౌత్ జోన్ వార్ రూమ్ లో మొత్తం 205 మంది ఉద్యోగులు పని చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ సయ్యద్ నసీర్ హుస్సేన్ గుర్తు చేసి ఆ జాబితాను మీడియాకు విడుదల చేశారు. వారిలో 17 మంది ముస్లీంలు మాత్రమే బెడ్ బ్లాకింగ్ దందాకు పాల్పడుతున్నారని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఆరోపించారని, మిగిలిన 177 మంది ఉద్యోగులు (హిందువులు) చక్కగా పని చేస్తున్నారని ఆ బీజేపీ ఎంపీ క్లీన్ చిట్ ఇచ్చారని సయ్యద్ నసీర్ హుస్సేన్ విమర్శించారు. 177 మంది 'సాఛాలు' అంటూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఎలా క్లీన్ చిట్ ఇస్తారు ? వాళ్లు ఏమైనా సాఛాలా ?, ఈ బీజేపీ ఎంపీ ఏమైనా ఈ కేసు విచారణ చేస్తున్న అధికారా ? అని కాంగ్రెస్ ఎంపీ సయ్యద్ నసీర్ హుస్సేన్ ప్రశ్నించారు.
థర్డ్ క్లాస్ బుద్ది ఎక్కడికి పోతుంది ?
బెంగళూరు దక్షిణ విభాగం బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య బ్రహ్మాణుల కోసం ఓ ప్రత్యేక ట్రస్టు నడుపుతున్నారు. ఈయన ఫోన్లు చేస్తే ఓ వర్గానికి మాత్రమే బెడ్ లు కేటాయించాలని కోవిడ్ వార్ రూమ్ ఉద్యోగులపై ఒత్తిడి చేస్తున్నారని, వాళ్లకు కావలసిన వాళ్లకే ఐసీయూ బెడ్ లు కేటాయిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ సయ్యద్ నసీర్ హుస్సేన్ ఆరోపించారు. ఒక ఎంపీగా కాకుండా తేజస్వి సూర్య థర్డ్ క్లాస్ బుద్ది చూపిస్తున్నాడని, థర్డ్ క్లాస్ మెంటాలిటీతో రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ సయ్యద్ నసీర్ హుస్సేన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మతరాజకీయాలు చేస్తే బాగుడందు జాగ్రత్త ?
బెడ్ బ్లాకింగ్ వ్యవహారంపై ఆరోపిస్తూ 17 మంది ముస్లీం ఉద్యోగుల మీద ఆరోపణలు చేసిన తేజస్వి సూర్య, బీజేపీ ఎమ్మెల్యేలు రవిసుబ్రమణ్య, సతీష్ రెడ్డి, గరుడాచార్ (అందరూ బీజేపీ) తదితరులు మతాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని, ఇది ఎవ్వరికి మంచిది కాదని, ఇకనైనా మతరాజకీయాలు మానుకోవాలని కాంగ్రెస్ ఎంపీ సయ్యద్ నసీర్ హుస్సేన్ తీవ్రస్థాయిలో బీజేపీ నాయకులను హెచ్చరించారు. మొదట బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యకు మతం పిచ్చి పోవడానికి వ్యాక్సిన్ ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చెయ్యడం కలకలం రేపింది.