Viral Video: ఇదేందయ్యా ఇదీ.. కారు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించలేదని జరిమానా..
ద్విచక్ర వాహనదారులు ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ తప్పకుండా ధరించాలని నిబంధనలు ఉంటాయి. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు టూ వీలర్స్ ను నడిపేవారు తప్పకుండా హెల్మెట్ ధరించాలని పోలీసులు నిత్యం సూచనలు చేస్తుంటారు. ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చొన్నవారు కూడా హెల్మెట్ ధరిస్తూ ఉన్న పలు కథనాలను మనం చూశాం. వారిని చూసినప్పుడు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా అభినందిస్తుంటారు. అయితే కర్ణాటక బెలగావి జిల్లాలోని అథని టౌన్ లో షాకింగ్ ఘటన జరిగింది. హెల్మెట్ ధరించలేదని ఓ కారు డ్రైవర్ కు రూ. 500 ఫైన్ విధిస్తూ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూసిన కారు డ్రైవర్ సుభాష్ భోజనే ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ఇటీవల అథని టౌన్ లోని అంబేద్కర్ సర్కిల్ వద్ద పోలీసులు ఏఐ కెమెరాను అమర్చారు. ఆ కెమెరా సుభాష్ కారును రికార్డు చేసింది.

కారు నడిపేటప్పుడు సుభాష్ హెల్మెట్ పెట్టుకోలేదని అందుకు రూ. 500 జరిమానా విధిస్తున్నట్లు ఈ మేరకు అతని మొబైల్ వాట్సాప్ నెంబర్ కు మెసేజ్ వచ్చింది. జరిమానా విధించడానికి కారణం అనే దగ్గర నో హెల్మెట్ అని రాసి ఉంది. దాంతో సుభాష్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇది ఏఐ కెమెరా లోపం అని గ్రహించిన సుభాష్ ఈ ఘటనను అధికారుల దృష్టికి వినూత్నంగా తీసుకెళ్లాలని భావించిన అతడు హెల్మెట్ పెట్టుకుని కారు నడుపుతూ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను రికార్డు చేశాడు. దాంతో రోడ్డుపై అతడ్ని చూసిన వాహనదారులు కారు లాంటి వాహనాలు నడిపేటప్పుడు కూడా హెల్మెట్ ధరించాలా..? అని ప్రశ్నించుకుంటున్నారు.
అంతేకాక ఈ ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ సుభాష్ ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. దాంతో క్షణాల్లో ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక తమ పొరపాటుని గ్రహించిన పోలీసులు.. ఆ వ్యక్తికి వేసిన జరిమానాను రద్దు చేసినట్లు సమాచారం. అయితే ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications
