Bengaluru: పోలీస్ స్టేషన్ లో మహిళ శవం పెట్టి ధర్నా, భర్త రెండో పెళ్లికి స్కెచ్ ?
పోలీస్ స్టేషన్ ఎదుట యువతి మృతదేహాన్ని పెట్టి ధర్నా చెయ్యడం కలకలం రేపింది. పెళ్లి జరిగి చాలా సంవత్సరాలు అయినా పిల్లలు పుట్టలేదని భర్తకు వేరే పెళ్లి చెయ్యడానికి ప్రయత్నించారు.
బెంగళూరు: వరకట్న వేధింపుల కారణంగా ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మృతురాలి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ఎదుట మృతదేహాన్ని పెట్టి ధర్నా చెయ్యడం కలకలం రేపింది. పెళ్లి జరిగి చాలా సంవత్సరాలు అయినా పిల్లలు పుట్టలేదని భర్తకు వేరే పెళ్లి చెయ్యడానికి ప్రయత్నించారు. రెండో పెళ్లి జరగకూడదు అంటే భారీ మొత్తంలో కట్నం ఇవ్వాలని వేధింపులకు గురి చేసి మా అమ్మాయిని కొట్టి చంపేశారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆందోళకు దిగారు.

ఇంట్లో ఆత్మహత్య
బెంగళూరులోని మెజెస్టిక్ సమీపంలోని లక్ష్మణ్ పురిలో వరకట్న వేధింపుల కారణంగా ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. మృతి చెందిన మహిళను సౌందర్యగా గుర్తించారు. సౌంధర్య ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో ఆత్మహత్య చేసుకుందని భర్త కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. భర్త విఘ్నేష్, అత్త ఇర్చమ్మ, బంధువులు యలీల్, విమల, రేవతి, శివలు కట్నం కోసం సౌంధర్యను వేధించారని, అందరూ కలిసి దారుణంగా కొట్టి చంపేసి ఉరి వేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని సౌంధర్య కుటుంబ సభ్యులు ఆరోపించారు.

పిల్లలు పుట్టలేదని భర్తకు రెండో పెళ్లి
నాలుగేళ్ల క్రితం సౌంధర్య, విఘ్నేష్ లకు వివాహమైయ్యింది. పెళ్లయి నాలుగేళ్లు గడిచినా ఆ దంపతులకు సంతానం కలగలేదు. దీంతో కొడుకు విఘ్నేష్ కు మరో పెళ్లి చేయాలని అతని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. భర్త రెండో పెళ్లికి అంగీకరించని సౌందర్య తనకు అన్యాయం చెయ్యకూడదని భర్త కుటుంబ సభ్యులకు చెప్పింది. అయితే భారీ మొత్తంలో వరకట్నం తీసుకురావాలని భర్త విఘ్నేష్ కుటుంబ సభ్యులు తరచూ వేధించేవారని ఆరోపణలు ఉన్నాయి.

భర్త ఫ్యామిలీ మీద కేసు
సంతానం లేకపోవడం, వరకట్నం కోసం నిత్యం సౌంధర్య, విఘ్నేష్ దంపతులకు, వారి కుటుంబ సభ్యులకు గొడవలు జరుగుతున్నాయని తెలిసింది. శుక్రవారం మద్యాహ్నం కూడా ఇదే విషయంలో గొడవ జరిగిందని, విఘ్నేష్ సభ్యులంతా కలిసి సౌందర్యను కొట్టారని మృతురాలు సౌంధర్య కుటుంబ సభ్యులు ఆరోపించారు. సౌంధర్య కుటుంబ సభ్యులు ఫిర్యాదు చెయ్యడంతో శేషాద్రిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది.

పోలీస్ స్టేషన్ ముందు శవం పెట్టి ధర్నా
నిందితులను అరెస్టు చేయాలని, లేదంటే సౌంధర్య మృతదేహాన్ని తీసుకెళ్లేది లేదని స్థానికులు, మృతురాలి బంధువులు శనివారం ఉదయం ఆసుపత్రి ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. అయితే శనివారం మధ్యాహ్నం ఆస్పత్రి నుంచి మృతదేహాన్ని తీసుకొచ్చి శేషాద్రిపురం పోలీస్ స్టేషన్ ఎదుట పెట్టి ధర్నా చేస్తున్నారని. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఓ మహిళ మృతదేహాన్ని పోలీస్స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలుపుతుండగా, నిందితులను అరెస్టు చేసే వరకు మృతదేహాన్ని తీసుకెళ్లేది లేదని ఆందోళనకారులు పోలీస్ స్టేషన్ ముందే కూర్చున్నారు. పోలీసులు సౌంధర్య కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతున్నారు. సౌంధర్య భర్త విఘ్నేష్ తో పాటు అతని కుటుంబ సభ్యులు అందరూ పరారైనారని పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications