యూపీలో బీజేపీకి చెక్ పెట్టేందుకు.. కొత్త వ్యూహం.. భీమ్ ఆర్మీతో భాగీదారి సంకల్ప్ మోర్చా?
దేశంలో ఉత్తరప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమే. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయంటే.. కొత్త పొత్తులు,కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తుంటాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్ల గడువు ఉన్నప్పటికీ.. ఇప్పటినుంచే ఆ దిశగా కసరత్తులు మొదలయ్యాయి. రాష్ట్రంలోని చిన్న పార్టీలన్నీ కలిసి ఇప్పటికే 'భాగిదారి సంకల్ప్ మోర్చా'ను ఏర్పాటు చేశాయి. ఇందులో భాగస్వామ్య పార్టీ అయిన సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధినేత, బీజేపీ మాజీ మిత్రపక్ష నాయకుడు ప్రకాష్ రాజ్బర్ తాజాగా భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్తో లక్నోలో భేటీ అయ్యారు. వీరిద్దరి భేటీతో బహుజన రాజకీయాలకు పుట్టినిల్లయిన ఉత్తరప్రదేశ్లో మరోసారి బహుజన రాజకీయ సమీకరణాలపై చర్చ ప్రారంభమైంది.

అప్పుడే మొదలైన ఊహాగానాలు..
లక్నోలోని దలీబాగ్ ప్రాంతంలో ఉన్న వీఐపీ గెస్ట్ హౌజ్లో చంద్రశేఖర్ ఆజాద్తో రాజ్బర్ భేటీ అయ్యారు. 2022 అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్దమవుతున్న నేపథ్యంలోనే రాజ్బర్ ఆజాద్ను కలిశారన్న ప్రచారం జరుగుతోంది. త్వరలోనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్టు చంద్రశేఖర్ ఆజాద్ ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఏర్పాటు చేయబోయే పార్టీ 'భాగిదారి సంకల్ప్ మోర్చా'లో చేరే అవకాశం ఉందన్న ఊహాగానాలు కూడా మొదలయ్యాయి.

భాగీదారి సంకల్ప్ మోర్చా
ఉత్తరప్రదేశ్లోని దళిత,బీసీ,మైనారిటీలు.. ఇలా బహుజనులందరినీ ఏకం చేసే ప్రధాన ఉద్దేశంతో భాగీదారి సంకల్ప్ మోర్చా పురుడు పోసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన పార్టీలైన సమాజ్వాదీ పార్టీ,బహుజన్ సమాజ్ పార్టీల పొత్తు అంచనాలను తలకిందులు చేసింది. ఈ రెండు పార్టీలు ఏకమైనా రాష్ట్రంలో అత్యధిక శాతం ఓటు బ్యాంకు కలిగిన బహుజనులను ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయాయి. ఫలితంగా బీజేపీకి ఏమాత్రం పోటీనివ్వలేక చతికిలపడ్డాయి. ప్రధాన బహుజన పార్టీల వైఫల్యం నేపథ్యంలో ప్రత్యామ్నాయంపై రాష్ట్రంలోని చిన్న పార్టీలు ఫోకస్ చేశాయి. ఈ క్రమంలోనే భాగీదారి సంకల్ప్ మోర్చా అనే కూటమిని ఏర్పాటు చేసి.. భావజాల సారూపత్య ఉన్నవారిని అందులోకి ఆహ్వానిస్తున్నాయి.

అందరి చూపు చంద్రశేఖర్ ఆజాద్ వైపే..
ఇదే క్రమంలో ఇటీవల దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న భీమ్ ఆర్మీ చంద్రశేఖర్.. దేశంలో బహుజన రాజకీయాలకు సరికొత్త నాయకుడిగా కనిపిస్తున్నారు. మరుగునపడ్డ బహుజన రాజకీయాలకు తనదైన దూకుడు శైలితో కొత్త మెరుగులు దిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలి సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో ఆంక్షలను సైతం లెక్క చేయకుండా ఆయన పాల్గొన్న తీరు మైనారిటీలను కూడా ఆలోచించేలా చేసింది. రాష్ట్రంలోని బహుజన నాయకులైన ములాయం,మాయవతిలు అంతగా ప్రభావం చూపలేకపోతుండటంతో.. కొత్త నాయకత్వం అవసరమనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. బీజేపీని గట్టిగా సవాల్ చేస్తూ దేశవ్యాప్తంగా బహుజన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండటం ఆయనకు అదనపు బలం. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల కోసం ఆజాద్ను కూడా తమతో చేతులు కలిపేందుకు ఒప్పించాలని భాగీదారి సంకల్ప్ మోర్చా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రత్యక్ష రాజకీయాల్లో రాణిస్తాడా..
ఆదివారం పలువురు మాజీ బీఎస్పీ నేతలతో సహా మరికొందరు రాజకీయ నాయకులు కూడా ఆజాద్తో భేటీ అయ్యారు. అదేరోజు మాజీ బీఎస్పీ నేతలు రామ్లఖన్ చౌరాసియా,ఇజారుల్ హక్,అశోక్ చౌదరి భీమ్ ఆర్మీలో చేరడం గమనార్హం. మొత్తం మీద వచ్చే ఎన్నికల నాటికి భీమ్ ఆర్మీని పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా మలిచేందుకు చంద్రశేఖర్ ఆజాద్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రెండేళ్లలోనే పార్టీ నిర్మాణం చేపట్టడం.. ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చేలా తీర్చిదిద్దడం ఆజాద్ ముందున్న సవాళ్లు. వీటిన్నింటిని అధిగమించి చంద్రశేఖర్ ఆజాద్ సరికొత్త బహుజన నాయకుడు అనిపించుకుంటాడా లేక.. ప్రత్యక్ష రాజకీయాల్లో చతికిలపడుతాడా అన్నది వేచి చూడాలి.












Click it and Unblock the Notifications