భారత్ కరోనా మరణాలలో బిగ్ జంప్ : తాజా కేసులు 16 వేలకు పైనే; ఆ రాష్ట్రం వల్లే మళ్ళీ భారీగా !!
భారతదేశంలో కరోనా మహమ్మారి కేసుల వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో కరోనా కేసులు కాస్త పెరగగా,మరణాలు భారీగా నమోదయ్యాయి. భారతదేశంలో ఒకే రోజు 16,326 కొత్త కోవిడ్-19 కేసులు పెరిగాయి. దీనితో భారతదేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,41,59,562కి చేరుకుంది. అయితే యాక్టివ్ కేసులు 1,73,728కి తగ్గాయి. ఇది 233 రోజుల తరువాత కనిష్టంగా నమోదైన కేసులుగా తెలుస్తుంది.
కేరళ మరణాల జాబితా సవరణతో భారీగా మరణాలు
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం గత 24 గంటల్లో భారతదేశం రోజువారీ కోవిడ్ మరణాలలో 666 మరణాల భారీ పెరుగుదలను నమోదు చేసింది. కేరళ నిన్న ఒక్కరోజే 563 మరణాలను నమోదు చేసింది. కేరళ రాష్ట్రం తన డేటాను సవరించడంతో మరణాల సంఖ్య భారీగా నమోదైంది. దేశంలోని మొత్తం మరణాల సంఖ్య 666కు కేరళ రాష్ట్రం నిన్న నమోదైన మరణాలు 563లో 291 మరణాలు సవరణలతో అదనంగా జోడించింది. భారతదేశంలో ఇప్పటివరకు 4,53,708 మంది కోవిడ్తో మరణించారు.

బాగా క్షీణించిన క్రియాశీల కేసులు
మొత్తం ఇన్ఫెక్షన్లలో 0.51 శాతంతో కూడిన క్రియాశీల కేసులు 1,73,728కి తగ్గాయి. 24 గంటల వ్యవధిలో మొత్తం క్రియాశీలక కోవిడ్-19 కేసులలో 2,017 కేసులు తగ్గాయి. అయితే జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 98.16 శాతంగా నమోదైంది. ఇది మార్చి 2020 నుండి అత్యధికం అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3.35 కోట్ల మంది కరోనా మహమ్మారిని జయించారు. నిన్న ఒక్కరోజే 17,677 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు.
మహారాష్ట్రలో 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో తెరుచుకున్న సినిమా హాళ్లు
గత 24 గంటల్లో 68.48 లక్షల టీకాలు వేసినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో మొత్తం దేశ వ్యాప్తంగా పంపిణీ అయిన టీకా సంఖ్య 101.30 కోట్ల మోతాదులకు చేరింది. శుక్రవారం నాడు 13,64,681 పరీక్షలు నిర్వహించగా, దేశంలో కోవిడ్-19 నిర్ధారణ కోసం ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం సంచిత పరీక్షల సంఖ్య 59,84,31,162కి చేరుకుంది. రాష్ట్రంలో కోవిడ్-19 కేసులు తగ్గుముఖం పట్టడంతో శుక్రవారం, అత్యంత దెబ్బతిన్న రాష్ట్రమైన మహారాష్ట్ర 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో సినిమా హాళ్లు, మరియు ఆడిటోరియంలను తిరిగి తెరిచింది.
వ్యాక్సినేషన్ పై మోడీ చెప్పిన అంశాలపై కాంగ్రెస్ విమర్శలు
భారతదేశం గురువారం 1 బిలియన్ కోవిడ్ వ్యాక్సిన్ డోస్ల మైలురాయిని పూర్తి చేసింది. ఒక రోజు తర్వాత జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ, ఇది "కేవలం సంఖ్య కాదు" అని, కానీ దేశ సామర్థ్యానికి మరియు "కొత్త భారతదేశానికి" చిహ్నం అని అన్నారు. రానున్న దీపావళి ఉత్సాహంతో టీకాల రికార్డును మరియు అన్ని రంగాలలో ఆశావాద భావనను చాటుతూ ముందుకు సాగాలని ప్రధాన మంత్రి అన్నారు. అయితే వ్యాక్సినేషన్ గురించి ప్రధాని అర్ధ సత్యాలు చెప్పారని, సగానికి పైగా అబద్దాలేనని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. దీనిపై శ్వేతపత్రం విడుదల చెయ్యాలని డిమాండ్ చేసింది.
కేరళలో భారీగా కేసులు, మరణాలు .. వివిధ రాష్ట్రాల్లో పరిస్థితి ఇదే
ఇదిలా ఉంటే గత 24 గంటల్లో కేరళ రాష్ట్రంలో 9361 కరోనా కేసులు నమోదు కాగా 563 మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్రలో గత 24 గంటల్లో 1632 కరోనా కేసులు నమోదు కాగా, 40 మంది కరోనా కారణంగా మృతి చెందారు. తమిళనాడు రాష్ట్రంలో గత 24 గంటల్లో 1152 కరోనా కేసులు నమోదు కాగా 19 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 846 కరోనా కేసులు నమోదు కాగా 12 మంది కరోనా కారణంగా మరణించారు. మిజోరంలో 737 మంది కరోనా కేసులు నమోదు కాగా మరణాలు జీరోగా నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 478 కేసులు నమోదు కాగా ఆరుగురు మరణించారు. 467 కరోనా కేసులు నమోదు కాగా ముగ్గురు మరణించారు.












Click it and Unblock the Notifications