దేశంలో కరోనా కేసుల్లో అన్ వాంటెండ్ రికార్డ్: 35 లక్షల మార్క్: 63 వేల మందికి పైగా బలి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ గంటగంటకూ చెలరేగిపోతోంది. ఎవరూ కోరుకోని రికార్డులను నెలకొల్పుతోంది. రోజువారీ కొత్త కేసులు వేల సంఖ్యలో పుట్టుకొస్తున్నాయి. ఇదివరకు 60 వేలకు పైగా నమోదైన రోజువారీ కేసులు.. దాన్ని అలవోకగా అధిగమించేశాయి. 75 వేలకు పైగా నమోదవుతున్నాయి. దేశంలో మున్ముందు కరోనా పాజిటివ్ కేసుల తీవ్రత మరింత భయానకంగా మారే అవకాాశాలు లేకపోలేదనే సంకేతాలను ఇస్తున్నాయి. తాజాగా అన్లాక్-4 కూడా అమల్లోకి రాబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో రోజువారీ కేసుల్లో భారీ పెరుగుదల చోటు చేసుకోదనే గ్యారంటీ ఉండట్లేదు.

35 లక్షలను దాటేసిన కరోనా కేసులు..
దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 78,761 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 948 మంది మరణించారు. దీనితో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 35,42,734కు చేరుకుంది. ఇప్పటిదాకా 63,498 మంది మరణించారు. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 7,65,302కు చేరుకుంది. 27,13,934 మంది డిశ్చార్జి అయ్యారు. దీనికి సంబంధించిన వివరాలతో కూడిన తాజా బులెటిన్ను కొద్దిసేపటి కిందటే కేంద్ర వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు విడుదల చేశారు. కరోనా కేసులు 35 లక్షల మార్క్ను దాటుకోవడమంటే మాటలు కాదు.

10 లక్షల మార్క్..
దేశంలో కరోనా వైరస్ పరీక్షలు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. ఇప్పటిదాకా పరీక్షించిన శాంపిళ్లు నాలుగు కోట్లను దాటేశాయి. ఇప్పటిదాకా 4,14,61,636 శాంపిళ్లను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వెల్లడించింది. బుధవారం ఒక్కరోజులో 10,55,027 కరోనా శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. ఇదో రికార్డు. ఒక్కరోజు వ్యవధిలో 10 లక్షలకు పైగా కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించింది ఐసీఎంఆర్. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటకల్లో కరోనా శాంపిళ్ల పరీక్షలు పెద్ద సంఖ్యలో కొనసాగుతున్నాయి.

అన్లాక్-4 అమల్లోకి..
అన్లాక్-4 అమల్లోకి రాబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వైరస్ రోజువారీ కేసుల్లో మరింత భారీ పెరుగుదల చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదనే ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. మెట్రో రైళ్లు తిరిగి పట్టాలెక్కడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వందమందితో రాజకీయ సమావేశాలను నిర్వహించుకోవడానికీ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోవిడ్ స్టాండర్డ్ ప్రొసీజర్లను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుందని ఆదేశిస్తూ కొత్తగా మార్గదర్శకాలను విడుదల చేసింది. వాటిని ఎంతవరకు పాటిస్తారనే దాని మీదే కరోనా పాజిటివ్ కేసుల పెరుగుదల ఆధారపడి ఉందనడంలో సందేహాలు అక్కర్లేదు.
Recommended Video

ఐసీఎంఆర్ డీజీ వ్యాఖ్యలకు..
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను ప్రజలు పెద్దగా పాటిస్తున్న దాఖలాలు లేవని, ఫలితంగా కరోనా వైరస్ రోజువారీ కేసులు అనూహ్యంగా పెరిగిపోతున్నాయంటూ కొద్దిరోజుల కిందటే ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ అసహనాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మాస్కులను ధరించడం, చేతులను శానిటైజర్లతో శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరాన్ని పాటించడంలో నిర్లక్ష్యం కనిపిస్తోందంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేయడం.. దేశంలో నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతోంది. దానికి అనుగుణంగా రోజువారీ కేసుల్లో అనూహ్య పెరుగుదల.. ఆందోళనకు గురి చేస్తోందని అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications