అమానుషం: మృతదేహాన్ని బైక్కు కట్టి తీసుకెళ్లారు
భువనేశ్వర్: పేదరికమో లేక నిర్లక్ష్యమో తెలియదు గానీ ఇద్దరు యువకులు ఓ మహిళ మృతదేహాన్ని ద్విచక్రవాహనంపై తీసుకొని వెళ్లడం ఒరిస్సాలోని నబరంగపూర్ జిల్లాలో కలకలాన్ని సృష్టించింది. వివరాల్లోకి వెళితే... భారాముండా గ్రామంలో ఓ మహళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
దీంతో ఆమె మృతదేహానికి సమీపంలోని జారిగాన్ ఆరోగ్య కేంద్రంలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసిన అనంతరం బైక్పై వెనకాల కట్టుకుని ఇద్దరు తీసుకెళుతున్న దృశ్యాలు భీతి గొల్పాయి.
అయితే మృతదేహాన్ని తరలించేందుకు వాహనం అందుబాటులో లేకపోవడంతో అలా చేశారా? లేక పేదరికం వల్ల అలా చేశారా అనేది దానిపై స్పష్టత రాలేదు. ఈ సంఘటన ఆ నోటా ఈనోటా పడి చివరకు జిల్లా కలెక్టర్ చెవిన పడింది.
దీంతో దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ రష్మిత్ పాండా ఆ చట్టుపక్కల 20 కిలోమీటర్ల పరిధిలో రెండు వాహనాలను అందుబాటులో ఉంచామన్నారు. మృతదేహాలను తరలించేందుకు వీలుగా పేదలకోసం వీటిని అందుబాటులో ఉంచామన్నారు.
కాగా గతంలో కూడా ఇలాంటి సంఘటనే బరంగపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. కొన్ని నెలల క్రితం చాలనగూడ దగ్గర ఆత్మహత్య చేసుకున్న ఓ రైతు మృతదేహాన్ని ఇదే తరహాలో పోస్ట్ మార్టం కోసం తరలించిన దృశ్యాలు మీడియాలో ప్రముఖంగా వచ్చాయి.