ఆసక్తికరం: రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ పోటీ
న్యూఢిల్లీ: అమేథీలో ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ప్రముఖ నటి, బిజెపి నేత స్మృతి ఇరానీ పోటీ చేయనున్నారు. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున కుమార్ విశ్వాస్ పేరు ఖరారైంది. దీంతో ఆమేథీ లోకసభ స్థానంలో పోటీ ఆసక్తికరంగా మారనుంది.
ఆమేథీ నుంచి రాహుల్ గాంధీ 2004, 2009 ఎన్నికల్లో గెలిచారు. ఆయనను ఓడించడానికి కుమార్ విశ్వాస్ ఆమేథీలోనే మకాం వేశారు. బిజెపి తరఫున స్మృతి ఇరానీ పోటీ చేయనున్న స్థితిలో అందరి దృష్టి ఆ నియోజకవర్గంపై పడనుంది.
కాగా, రాయబరేలీలో సోనియా గాంధీపై పోటీ చేసే అభ్యర్థిగా సుప్రీంకోర్టు న్యాయవాది అజయ్ అగర్వాల్ పోటీ చేయనున్నారు. సోనియాపై ఉమా భారతిని పోటీకి దించుతారని మొదట భావించారు. పార్టీ నిర్ణయిస్తే తాను పోటీ చేస్తానని కూడా ఉమా భారతి అన్నారు. అయితే, ఆమెను పోటీకి దించే విషయంలో బిజెపి వెనక్కి తగ్గింది.
స్మృతి ఇరానీ బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి సన్నిహితురాలు. రాహుల్ గాంధీ అధికారికంగా ప్రకటించకపోయినా కాంగ్రెసు ప్రధాని అభ్యర్థి అనే విషయం తెలిసిందే. దీంతో రాహుల్ గాంధీని లక్ష్యం చేసుకుని స్మృతి ఇరానీని పోటీకి దించాలని బిజెపి నాయకత్వం నిర్ణయించుకుంది.