బీజేపీ ఓటమి స్వయంకృతాపరాధమేనన్న ఎంపీ
తెలంగాణ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో బీజేపీ ఘోర వైఫల్యం చెందింది. బీజేపీ ఓటమికి కారణం స్వయంకృతాపరాధమేనా అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. అది కూడా సొంత నేతల నుంచే ఈ వాదన వినపడటం విశేషం. బీజేపీ అధికారంలోకి వస్తే అయోధ్యలో రామమందిర నిర్మాణం, రాష్ట్రవ్యాప్తంగా రాముని విగ్రహాల ఏర్పాటు, ఆయా నగరాల పేర్లలో మార్పు చేస్తామని చెప్పడంతోనే బీజేపీ ఓటమి పాలైందన్నారు ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు సంజయ్ కకాడే.
రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో బీజేపీ ఓటమి పాలవుతుందని తాను ముందే ఊహించినట్లు చెప్పారు సంజయ్ కకాడే. కానీ మధ్యప్రదేశ్లో మాత్రం పరిస్థితి వేరుగా ఉందని చెప్పారు. 2014 మోడీ చేస్తానని చెప్పిన అభివృద్ధి గురించి ప్రజల్లోకి తీసుకెళ్లడం మానేసి రామమందిర నిర్మాణం, రాముని విగ్రహాలు, నగరాల పేర్లు మార్పుల గురించి చెప్పడంతోనే బీజేపీ నష్టం చవిచూసిందన్నారు. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలువగా... రాజస్థాన్లో కూడా ప్రభుత్వాన్ని హస్తంపార్టీ ఏర్పాటు చేయనుంది. మధ్యప్రదేశ్లో మాత్రం కాంగ్రెస్ బీజేపీల మధ్య పోరు నువ్వానేనా అన్న స్థాయిలో ఉంది. ఇక్కడ బీఎస్పీ, స్వతంత్ర అభ్యర్థులు ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానున్నారు.
ఇప్పటి వరకు ఉత్తర భారతం అంతా కాషాయమయం కాగా మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కాషాయం పార్టీకి బ్రేక్ పడుతుంది. అంతేకాదు 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. సొంత పార్టీపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం కకాడేకు ఇది తొలిసారి కాదు. 2017లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సీట్లు బీజేపీకి వస్తాయా లేదా అనేది నమ్మకం లేదంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సి సంఖ్యాబలం తెచ్చుకుంటుందని కామెంట్ చేశారు.