కూల్ చేసేందుకా: ఉద్ధవ్థాకరేకు బిజెపి 'పులి' కానుక!
ముంబై: ఇటీవల శివసేన - భారతీయ జనతా పార్టీల మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శివసేన అధ్యక్షులు ఉద్ధవ్ థాకరేకు బిజెపి ఫైబర్తో తయారైన పులి బొమ్మను బహుమతిగా ఇవ్వనుంది. పులి శివసేన పార్టీ గుర్తు అని తెలిసిందే.
కొంతకాలంగా బిజెపి, శివసేన పార్టీల మధ్య తరచు భేదాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పంజాబ్లోని పఠాన్కోట్ దాడి పైన కూడా శివసేన తీవ్రంగా స్పందించింది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య సంబంధాలు మెరుగుపడేలా చూడాలని బిజెపి నేతలు ప్రయత్నిస్తున్నారు.
ఇందులో భాగంగా పులి బొమ్మను కానుకగా ఇవ్వాలని భావిస్తున్నారని తెలుస్తోంది. బిజెపి సీనియర్ నేత, మహారాష్ట్ర అటవీశాఖ మంత్రి సుధీర్ ముంగంటివార్ వచ్చే వారం దీనిని ఉద్ధవ్ థాకరేకు అందించనున్నారు. ఈ బొమ్మ ఏడు అడుగుల ఎత్తు, 3.5 అడుగుల వెడల్పు, 55 కేజీల బరువు ఉంటుందని తెలుస్తోంది.
ఈ విషయంపై మంత్రి సుధీర్ ముంగంటివార్ మాట్లాడుతూ.. కేవలం తమ మధ్య ఉన్న స్నేహంతోనే ఈ బొమ్మను కానుకగా అందిస్తున్నామని, ఇందులో రాజకీయం ఏమీ లేదన్నారు.
ఉద్ధవ్ థాకరే జంతు ప్రేమికుడని, అంతేకాక తమ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సేవ్ టైగర్ ప్రాజెక్ట్ ప్రచారంలో భాగంగానూ ఇది ఉంటుందని భావిస్తున్నామని చెప్పారు. ఈ ప్రతిమలాంటిదే మరొకదాన్ని సేవ్ టైగర్ ప్రాజెక్టు బ్రాండ్ అంబాసడర్గా ఉన్న అమితాబ్ బచ్చన్కు కూడా ఇచ్చినట్లు చెప్పారు.
కాగా, ఓ శివసేన సీనియర్ నేత మాట్లాడుతూ... మిత్రపక్షాల పట్ల బిజెపి తన వైఖరి మార్చుకోవాలని అభిప్రాయపడ్డారు. బిజెపి ఐడియాలజీకి తమ పార్టీ అధినేత ఉద్ధవ్ థాకరే ఎప్పుడూ వ్యతిరేకం కాదన్నారు. అయితే, కొన్ని అంశాల్లో బిజెపి ఇంటెన్షన్ను ఆయన ప్రశ్నిస్తున్నారన్నారు. బిజెపి సరైన విధానంతో వెళ్తే ఉద్దవ్కు ఎలాంటి బహుమతులు ఇవ్వవలసిన అవసరం లేదన్నారు.