రెచ్చిపోయిన బిజెపి ఎంపీ, చేసిందేమీ లేదు: ములాయం
న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ ఎంపీ ఆదిత్యనాథ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్లో ఓ వర్గం జనాభా చాలా రెట్లు పెరిగిపోతుందన్న ఆయన, ఆ వర్గానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఆర్దిక దన్నుగా నిలుస్తోందని విరుచుకుపడ్డారు. సెప్టెంబర్ 13న జరగనున్న ఉపఎన్నికల్లో భాగంగా ఆదివారం నోయిడాలో పర్యటించిన ఆదిత్యనాథ్, అక్కడి బీజేపీ తరుపున ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో మాట్లాడుతూ ఆయన ఉత్తరప్రదేశ్లోని పశ్చిమ భాగంలో 450 సార్లు మత కలహాలు చోటుచేసుకున్నాయన్నారు.
ఉత్తరప్రదేశ్ తూర్పుభాగంలో ఇలాంటి ఘర్షణలు ఎందుకు చోటుచేసుకోవడం లేదని ప్రశ్నించిన ఆదిత్యనాథ్, ఓ వర్గం జనాభా అత్యధికంగా పెరగడం వల్లనే ఈ ఘర్షణలకు కారణమని విమర్శించారు. ఆ వర్గానికి కేటాయిస్తున్న నిధులను రాష్ట్రం విద్యుత్ రంగానికి కేటాయిస్తే, రాష్ట్రంలో విద్యుత్ కోతలకు చెక్ పడుతుందని చెప్పారు. అంతేకాకుండా తూర్పు ఉత్తరప్రదేశ్లోని హిందువులపై దాడులు జరిగితే, తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.

బీజేపీ ఆత్మపరిశీలన చేసుకోవాలి: ములాయం సింగ్ యాదవ్
ఉత్తరప్రదేశ్లో తమను విమర్సించే ముందు భారతీయ జనతా పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలని సమాజ్వాది పార్టీ అధ్యక్షడు ములాయం సింగ్ యాదవ్ అన్నారు. కేంద్రంలో మూడు నెలలు ఎన్డీఏ పాలనపై ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఎన్నికలను నిలబెట్టుకోవడంలో నరేంద్రమోడీ ప్రభుత్వం విఫలమైందని ములాయం అన్నారు. ఇది ఇలా ఉంటే 30 నెలల్లో హామీలు నిలబెట్టుకోని సమాజ్వాది పార్టీ ప్రభుత్వం మూడు నెలల ఎన్డీఏ పాలనను తప్పుబట్టడం హాస్యాస్పదమని అన్నారు.












Click it and Unblock the Notifications