ఓవైసీ, సిద్ధిఖీలతో బీజేపీ భారీ కుట్ర -బయటి గుండాలను తరిమేద్దాం -బెంగాల్ ప్రచారంలో దీదీ నిప్పులు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాదీ అసదుద్దీన్ ఓవైసీ పేరు మారుమోగుతోంది. బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ వరుసగా రెండో రోజూ మజ్లిస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఓవైసీ నాయకత్వంలోని ఏఎంఎంఐఎం పార్టీ.. బీజేపీకి బీ-టీమ్ గా వ్యవహరిస్తోందని, వీళ్లకిప్పుడు ఇండియన్ సెక్యూలర్ ఫ్రంట్(ఐఎస్ఎఫ్) నేత అబ్బాస్ సిద్ధిఖీ తోడయ్యాడని దీదీ విమర్శించారు.

ఆ ఇద్దరితో కలిసి బీజేపీ కుట్రలు
పశ్చిమ బెంగాల్ లో బీజేపీ బొత్తిగా బరితెగించి విభజన రాజకీయాలు చేస్తోందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. హిందూ, ముస్లింలను విభజించడానికి ఏఐఎంఐఎం, ఐఎస్ఎఫ్ పార్టీలను బీజేపీ వాడుకుంటోందని దుయ్యబట్టారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని రాయిడిఘిలో శనివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు.

ఓవైసీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్లే..
అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం, అబ్బాస్ సిద్ధిఖీ నాయకత్వంలోని ఐఎస్ఎఫ్ పార్టీలపై టీఎంసీ చీఫ్ మమత విమర్శలు గుప్పించారు. హిందూ, ముస్లింలను విభజించడానికి ఈ రెండు పార్టీలకు బీజేపీ డబ్బులిచ్చిందని ఆరోపించారు. ''మీరు వేరుపడాలని కోరుకోకపోతే, మీరు ఎన్ఆర్సీని కోరుకోకపోతే, ఆ పార్టీలకు ఓటు వేయకండి. నిజానికి ఎంఐఎం లేదా ఐఎస్ఎఫ్ లకు ఓటేస్తే అది బీజేపీకి వేసినట్లే. మన ఆడబిడ్డలు కిడ్నాప్ అవుతారని వాళ్ళు బెదిరిస్తున్నారు. బయటివారైన బీజేపీ, ఎంఐఎం గూండాలకు బెంగాల్ నుంచి తరిమేద్దాం'' అని మమతా బెనర్జీ పిలుపునిచ్చారు.

అశాంతితో బీజేపీకి లబ్ది..
బెంగాల్ లోని హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులంతా 'హరే కృష్ణ హరే హరే, తృణమూల్ ఘరే ఘరే' అంటున్నారని, కానీ బీజేపీవారు మాత్రం 'హరే కృష్ణ హరే హరే, హిందూ, ముస్లిం భాగ్ కరే, షెడ్యూల్డు క్యాస్ట్స్ కో భాగ్ కరే' అంటున్నారని మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీవారు బెంగాల్ను నాశనం చేస్తున్నారని తిట్టిపోశారు. హిందువులు, ముస్లింలు కలిసి టీ తాగడం, కలిసిమెలిసి దుర్గా పూజ చేయడం బెంగాల్ సంస్కృతి అని, బెంగాల్లోని గ్రామాల్లో అశాంతి రాజేయడం ద్వారా లబ్ధి పొందాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. బెంగాల్ ఎన్నికల్లో మూడో దశ పోలింగ్ ఏప్రిల్ 6న జరుగుతుంది. ఎనిమిదో, చివరి దశ పోలింగ్ ఏప్రిల్ 29న జరుగుతుంది.












Click it and Unblock the Notifications