సీఎం సిద్దూకు సిగ్గుండాలి, రూ. 2 లక్షల కోట్లు ఇచ్చాం, 2 వేల మంది ఆత్మహత్య: అమిత్ షా!
బెంగళూరు/మైసూరు: కర్ణాటకలో బీజేపీ చేపట్టిన నవ కర్ణాటక పరివర్తనా యాత్ర సందర్బంగా మైసూరు నగరంలోని మహారాజ కాలేజ్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోశారు. కేంద్రాన్ని ప్రశ్నించడానికి సీఎం సిద్దరామయ్యకు సిగ్గుండాలని అమిత్ షా మండిపడ్డారు.
సిద్దరామయ్య జాదూ
కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వం రాష్ట్రవ్యాప్త బంద్ కు మద్దతు ఇచ్చి మైసూరులో జరుగుతున్న తన బహిరంగ సభను అడ్డుకోవాని ప్రయత్నించిందని, అయితే కార్యకర్తలు వేల సంఖ్యలో తరలి వచ్చారని అమిత్ షా అన్నారు. సీఎం సిద్దరామయ్య జాదూ అంటూ అమిత్ షా విమర్శించారు.
కాంగ్రెస్ కు భయం
మాజీ సీఎం బీఎస్. యడ్యూరప్ప చేపట్టిన నవ కర్ణాటక పరివర్తనా యాత్రకు వస్తున్న స్పందన చూసి కాంగ్రెస్ నాయకులకు భయం పట్టుకుందని, సీఎం సిద్దరామయ్య ఎంత బలప్రయోగం చేసినా కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకుండా అడ్డుకోలేరని అమిత్ షా అన్నారు.
చాముండేశ్వరి సాక్షిగా!
చాముండేశ్వరి దేవి వెలసిన పవిత్ర భూమి మీద నిలబడి చెబుతున్నా, కర్ణాటక ప్రజలు ఈ సారి జరిగే శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ది చెప్పి ఇంటికి పంపిస్తారని, అందులో ఎలాంటి సందేహం లేదని అమిత్ షా చెప్పారు. సిద్దరామయ్య ప్రభుత్వం నూరుశాతం అవినీతి మయం అయ్యిందని అమిత్ షా ఆరోపించారు.
సీఎం దగ్గర రూ. 70 లక్షల వాచ్
ఇక్కడ జరుగుతున్న సమావేశంలో దాదాపు 50 వేల మంది ఉన్నారు. ఒక్కరి దగ్గర అయినా రూ. 70 లక్షల విలువైన వాచ్ ఉందా అని అమిత్ షా బీజేపీ కార్యకర్తలను ప్రశ్నించారు. అయితే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే సీఎం సిద్దరామయ్య రూ. 70 లక్షల విలువైన వాచ్ చేతికి వేసుకుని వయ్యారంగా తిరుగుతున్నారని అమిత్ షా ఆరోపించారు.
20 మంది హత్య, హిందూ ద్రోహి
సీఎం సిద్దరామయ్య అధికారంలోకి వచ్చిన తరువాత 20 మంది హిందూ సంఘ, సంస్థ కార్యకర్తలను హత్య చేశారని అమిత్ షా గుర్తు చేశారు. దేశద్రోహులైన ఎస్ డీపీఐ నాయకులు, కార్యకర్తల మీద నమోదు అయిన కేసులు ఎత్తివేసిన సిద్దరామయ్య హిందువులకు ద్రోహం చేశారని అమిత్ షా మండిపడ్డారు.
Recommended Video
2,500 రైతులు ఆత్మహత్య
సిద్దరామయ్య అధికారంలోకి వచ్చిన తరువాత కర్ణాటకలో 2,500 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, అయినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతల గురించి పట్టించుకోవడం లేదని అమిత్ షా ఆరోపించారు. సిద్దరామయ్య ప్రభుత్వం ఆహారం, మంచాలు, దుప్పట్లు కొనుగోలులో అవినీతికి పాల్పడిందని, ఆయన అవినీతి గురించి పూర్తిగా వివరించాలంటే 7 రోజులు పడుతుందని అమిత్ షా అన్నారు.
రూ. 2 లక్షల కోట్లు !
60 ఏళ్లలో కర్ణాటకకు ఎవ్వరూ ఇవ్వనంత ఆర్థిక సహాయం ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిందని, 14వ ఆర్థిక పథకంలో భాగంగా ఈ రాష్ట్రానికి రూ. 2 లక్షల కోట్లకు పైగా ఇచ్చారని, అయినా సిద్దరామయ్య ఢిల్లీకి వచ్చి మాకు మీరు ఏమి ఇచ్చారు అంటూ సిగ్గులేకుండా ప్రశ్నిస్తున్నారని అమిత్ షా మండిపడ్డారు. ఇదే సందర్బంలో కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం మీద అమిత్ షా దుమ్మెత్తిపోశారు.