నాపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు: కాబోయే సీఎం
న్యూఢిల్లీ: హర్యానా తొలి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తన వృత్తి వ్వవసాయమని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. ఈ ఆఫిడవిట్లో వ్యవసాయంతోపాటు ట్యూషన్ కూడా చెప్పానని తెలిపారు.
ఎన్నికల అఫిడవిట్లో సమర్పించిన వివరాల ప్రకారం తనకు రోహ్తక్ జిల్లాలోని బిన్యాయి గ్రామంలో వారసత్వంగా వచ్చిన 2.5 ఎకరాల వ్యవసాయ భూమి ఉందిని.. దాని విలువ రూ. 50 లక్షలుగా పేర్కొన్నారు.
మరో వైపు 800 చదరపు అడుగుల నివాస స్ధలం ఉందని.. దాని విలువ రూ. 3 లక్షలుగా పేర్కొన్నారు. వీటితో పాటు బ్యాంకులో రూ. 2.29 లక్షలు సహా రూ. 8.29 లక్షల చరాస్తులు, రూ. 53 వేల స్ధిరాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు.
బ్యాంకులో రూ. 5 లక్షల రుణం కూడా ఉంది. ఎలాంటి వాహనం కాని, వ్యవసాయేతర భూములు లేవన్న కట్టర్.. అలాగే క్రిమినల్ కేసులు కూడా లేవని పేర్కొన్నారు.
మనోహర్ లాల్ ఖట్టర్:
ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడు మనోహర్ లాల్ ఖట్టర్. 1980 నుంచి 1994 వరకు ఆర్ఎస్ఎస్లో పూర్తి స్ధాయిలో పనిచేసిన ఖట్టర్, ఆ తర్వాత బీజేపీలో చేరారు. 60 సంవత్సరాలు వయసున్న ఖట్టర్ ఇంకా పెళ్లి చేసుకోలేదు.
గత ఎన్నికల్లో హర్యానాలో కేవలం నాలుగు స్ధానాలకే పరిమితమైన బీజేపీ ఈసారి ఏకంగా 47 స్ధానాలను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. హర్యానా రాష్ట్రంలో ఉన్న మొత్తం అసెంబ్లీ స్ధానాల సంఖ్య 90. హర్యానాలో మనోహర్ లాల్ ఖట్టర్ ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ కర్నాల్. కర్నాల్ నియోజక వర్గం నుంచి తన ప్రత్యర్ధిపై 63,736 ఓట్ల మెజారిటీ గెలుపొందారు.