రెచ్చిన తృణమూల్, బీజేపీ నేత, నటి రూపపై దాడి
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆదివారం నాడు రెచ్చిపోయారు. ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తుండగా బీజేపీ నేత, నటి రూపా గంగూలీపై కోల్కతా నౌకాశ్రయం సమీపంలో కొందరు టీఎంసీ కార్యకర్తలు ఆమె కారుపై దాడికి దిగారు.
ఈ ఘటనలో ఆమెకు స్పల్ప గాయాలయ్యాయి. దీంతో ఆమెను స్థానికి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇటీవలే జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర హౌరా స్థానం నుంచి రూపా గంగూలీ పోటీ చేసి ఓడిపోయారు.
రాజకీయ కక్షలతోనే ఆమెపై దాడి జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. తన పైన తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 24 పరగణాల జిల్లా నుంచి తిరిగి వస్తున్న క్రమంలో దాడికి పాల్పడ్డారు.
దాడి జరుగుతున్న సమయంలో పోలీసులు అక్కడే ఉన్నా, తమను దుండగుల నుంచి ఏమాత్రం కాపాడలేదని, మొత్తం ఘర్షణను పోలీసులు చోద్యం చూశారని ఆమె ఆరోపించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు.