మోడీపై అసభ్య వ్యాఖ్యలు: యువకుడితో గుంజీళ్ళు తీయించి, ఉమ్మి నాకించి; బీజేపీ కార్యకర్తల అమానుషం
ప్రధాని నరేంద్ర మోడీని దూషించినందుకు ఓ యువకుడిపై దాడి జరిగింది. జార్ఖండ్ రాష్ట్రంలో జరిగిన ఈ దారుణ ఘటనలో ప్రధాని నరేంద్ర మోడీ అసభ్య పదజాలంతో దూషించాడని బిజెపి కార్యకర్తలు ఒక యువకుడు పై అమానుషంగా ప్రవర్తించారు.
రోడ్డుపై ఉమ్మి నాకించి, గుంజీళ్ళు తీయించిన బీజేపీ కార్యకర్తలు
జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్బాద్లో బిజెపి కార్యకర్తలు ఒక యువకుడిని కొట్టి, అతన్ని మోకాళ్లపై కూర్చోబెట్టి బలవంతంగా అతనితో రోడ్డుపై ఉన్న ఉమ్మి నాకించారు. అతనితో గుంజిళ్లు తీయించి 'జై శ్రీ రామ్' అని నినాదాలు చేయించారు. ప్రధాని నరేంద్ర మోడీని నోటికొచ్చినట్టు దూషించిన ముస్లిం యువకుడిపై బీజేపీ ఎంపీ పీఎన్ సింగ్, బీజేపీ ఎమ్మెల్యే రాజ్ సిన్హా తదితర నేతల సమక్షంలోనే ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది.
మోడీపై అసభ్య పదజాలం.. యువకుడిని కొట్టిన బీజేపీ కార్యకర్తలు
ధన్బాద్లోని గాంధీ చౌక్లో పంజాబ్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న భద్రతా లోపంపై బిజెపి కార్యకర్తలు శుక్రవారం నిరసన తెలిపారు. వారి నిరసన సమయంలో, అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి జార్ఖండ్ బిజెపి చీఫ్ దీపక్ ప్రకాష్ మరియు ప్రధాని నరేంద్ర మోడీపై అసభ్య పదజాలాన్ని ఉపయోగించినట్లు బిజెపి సీనియర్ నాయకులు తెలిపారు.
ట్రాఫిక్ పోలీసులు ప్రధాని మోడీని ఆ యువకుడు దూషిస్తున్నా ప్రేక్షక పాత్ర వహించాలని వారు ఆరోపించారు. మోడీపై వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు ఆ వ్యక్తిని దారుణంగా కొట్టడంతో ముస్లిం సామాజికవర్గానికి చెందిన వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దాడికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారింది.
చర్యలు తీసుకుంటామని సీఎం హేమంత్ సోరెన్ హామీ
బిజెపి కార్యకర్తలు ఓ యువకుడి పై అమానుషంగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ట్విట్టర్లో హామీ ఇచ్చారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సామాజిక వ్యవస్థను దెబ్బతీయడానికి ఎవరినీ అనుమతించబోమని, మత సామరస్యానికి విఘాతం కలిగించే వారిని వదిలిపెట్టబోమని ముఖ్యమంత్రి అన్నారు.
బాధితుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు
ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. బాధితుడి సోదరుడు రెహాన్ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వైరల్ వీడియో ఆధారంగా ఇద్దరు బీజేపీ కార్యకర్తల ఇళ్లపై పోలీసులు దాడి చేసి దాడికి బాధ్యులైన నలుగురిని అరెస్ట్ చేశారు. దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మనోజ్ స్వర్గియరీ తెలిపారు.
మండిపడుతున్న రాజకీయ పార్టీలు
కాంగ్రెస్ మరియు జార్ఖండ్ ముక్తి మోర్చా ఈ సంఘటనను తీవ్రంగా ఖండించాయి. ఇది అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు బిజెపి మినహా రాజకీయ పార్టీల నాయకులు. ఇటువంటి సంఘటనలను నిరోధించడానికి రాష్ట్రం ఇప్పటికే బిల్లును ఆమోదించిందని, అయితే అలాంటి కేసులు ఇంకా పుట్టుకొస్తున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఈ విషయాన్ని పార్టీ పరిశీలిస్తుందని, దాడి చేసినవారు వాస్తవానికి బిజెపి కార్యకర్తలా కాదా అని దర్యాప్తు చేస్తామని బిజెపి నాయకుడు సిపి సింగ్ చెప్పారు. పార్టీ కార్యకర్తలు అని తేలితే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధిత వ్యక్తిని కొట్టాలని పార్టీ సీనియర్ నేతలెవరూ కార్యకర్తలను కోరుకోలేదని కూడా బిజెపి నాయకులు వెల్లడిస్తున్నారు.