బాలీవుడ్ సినిమా గొడవ: సుందర్ పిచాయ్పై ఎఫ్ఐఆర్
ముంబై: టాప్ సెర్చింజిన్ గూగుల్ ముఖ్య కార్యనిర్వహణాధికారి సుందర్ పిచాయ్పై ముంబైలో ఎఫ్ఐఆర్ నమోదైంది. బాలీవుడ్ నిర్మాత్ ఒకరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. సుందర్ పిచాయ్తో పాటు మరో అయిదుమందిపై కేసు ఫైల్ అయింది. తొలుత ఆ నిర్మాత- న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో ఎంఐడీసీ, అంధేరి ఈస్ట్ పోలీసులు ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. దర్యాప్తు మొదలు పెట్టారు.
వైఎస్ జగన్ నిర్ణయాన్ని స్వాగతించిన పురంధేశ్వరి: బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్ నుంచి నో రెస్పాన్స్
సుందర్ పిచాయ్పై కేసు నమోదు కావడానికి ప్రధాన కారణం.. ఓ బాలీవుడ్ సినిమా గొడవ. ఏక్ హసీనా థీ ఏక్ దీవానా థా అనే బాలీవుడ్ సినిమా ఇటీవలే యూట్యూబ్లో అప్లోడ్ అయింది. 2017లో విడుదలైన మూవీ ఇది. శివ్ దర్శన్, నటాషా ఫెర్నాండెజ్, ఉపేన్ పటేల్, సాన్ మహాజన్ నటించిన సినిమా ఇది. ఫ్లాప్ మూవీగా పేరు తెచ్చుకుంది. ఈ సినిమాను సునీల్ దర్శన్ నిర్మించారు. ఆయనే దర్శకుడు కూడా.
ఈ సినిమా యూట్యూబ్లో అప్లోడ్ అయింది. మంచి వ్యూస్ను సాధించింది. ఈ సమాచారం తెలిసిన వెంటనే సునీల్ దర్శన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ సినిమా కాపీ రైట్స్ తన వద్దే ఉన్నాయని, ఎవరికీ విక్రయించలేదని అన్నారు. అలాంటప్పుడు తన అనుమతి లేకుండా దీన్ని ఎలా అప్లోడ్ చేస్తారని ప్రశ్నించారు. దీనిపట్ల తాను కొంతకాలంగా యూట్యూబ్ యాజమాన్యంతో న్యాయపోరాటం సాగిస్తున్నానని అన్నారు.
పలుమార్లు తన లాయర్ల ద్వారా నోటీసులను పంపించినప్పటికీ యూట్యూబ్ మేనేజ్మెంట్ నుంచి ఎలాంటి స్పందన రాలేదని చెప్పారు. ఈ సినిమాతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు దీన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేశారని, బిలియన్ల కొద్దీ వ్యూస్ను అందుకున్నారని అన్నారు. యూట్యూబ్తో పాటు దాన్ని అప్లోడ్ చేసిన వారు ఆదాయాన్ని ఆర్జించారని పేర్కొన్నారు. దీనిపై తాను పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ.. యూట్యూబ్ నుంచి స్పందన రాకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని అన్నారు.
ఏక్ హసీనా థీ ఏక్ దీవానా థా సినిమాకు సంబంధించిన పూర్తి మేథో సంపత్తి హక్కులు సునీల్ దర్శన్ వద్దే ఉన్నాయని ఆయన తరఫు న్యాయవాది ఆదిత్య చితాలే తెలిపారు. పూర్తి సాక్ష్యాధారాలను న్యాయస్థానానికి అందజేశామని, దీనికి బాధ్యులుగా సుందర్ పిచాయ్తో పాటు మరో అయిదుమందిని గుర్తించిందని అన్నారు. వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ కోర్టు ఆదేశించిందని వివరించారు. ఈ సినిమాకు సంబంధించిన హక్కులు ఎవరి వద్ద ఉన్నాయనే విషయంపై యూట్యూబ్ మేనేజ్మెంట్ సంప్రదింపులు జరపలేదని అన్నారు.