దద్దరిల్లిన అస్సాం: మోడీ రాకకు ఒక్కరోజు ముందు.. హై అలర్ట్!
యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం-ఇండిపెండెంట్ (ఉల్ఫా-ఐ)కి చెందిన వ్యక్తులే ఈ బాంబు పేల్చినట్లు పోలీసులు నిర్దారించారు.
దిబ్రూగఢ్: ప్రధాని నరేంద్ర మోడీ రాకను వ్యతిరేకిస్తూ అసోంలో తీవ్రవాదులు బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. దిబ్రూగఢ్ జిల్లాలోని దికోమ్ చరియాలో ఉన్న ఓ ఆయిల్ పైప్ లైన్ లో బాంబు పేలుడు సంభవించడంతో.. చుట్టు పక్కల ప్రాంతాలు దద్దరిల్లాయి.
యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం-ఇండిపెండెంట్ (ఉల్ఫా-ఐ)కి చెందిన వ్యక్తులే ఈ బాంబు పేల్చినట్లు పోలీసులు నిర్దారించారు. అటు అరుణోదయ్ అసాం పేరిట మీడియా సంస్థలకు అందిన ఓ లేఖలో.. ఈ చర్యకు పాల్పడింది తామేనని ఉల్ఫా-ఐ అంగీకరించింది. ప్రధాని మోడీ రాకను వ్యతిరేకిస్తూ ఈ బాంబు పేలుడు చర్యకు పాల్పడినట్లు తెలిపింది.
కాగా, బాంబు పేలుడు జరిగిన ప్రదేశంలో అనుమానిత ఉల్ఫా (ఐ) తీవ్రవాది మృతదేహాం లభ్యమవడం గమనార్హం. . బాంబు ప్రమాదవశాత్తు పేలడంతో అతను అక్కడిక్కడే మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మోడీ రాకకు ఒక్కరోజు ముందు బాంబు పేలుళ్లు చోటు చేసుకోవడంతో కేంద్రం హోంమంత్రిత్వ శాఖ ఒక్కసారిగా అలర్ట్ అయింది. అస్సాం పోలీసులు అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఉల్ఫా-ఐ మరన్ని దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్లు హోంమంత్రిత్వ శాఖ హెచ్చరించింది.