అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి కూర్చోవద్దు:మంత్రి
తిరువనంతపురం: కేరళ విద్యా శాఖ మంత్రి మంగళవారం నాడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ మంత్రిగా, వ్యక్తిగతంగా కూడా అమ్మాయిలు, అబ్బాయులు కలిసి కూర్చోవడానికి తాను ఒప్పుకోనని సదరు మంత్రి వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమయ్యాయి.
కేరళ విద్యా శాఖ మంత్రి అయిన పికె అబు రబ్ ఈ వ్యాఖ్యలు చేశారు. పాఠశాలలు, కళాశాలల్లో అబ్బాయిలు అమ్మాయిలు ఒకే బెంచ్ పైన కూర్చోవద్దన్నారు. ఇలా వీరు ఒకే బెంచి పైన కూర్చోవడాన్ని వ్యక్తిగతంగా నేను తీవ్రంగా వ్యతిరేకిస్తానని చెప్పారు.
అయితే, ఇక్కడ మన నిర్దేశాలు పనికి రావని, ఆయా కళాశాలలదే తుది నిర్ణయమని చెప్పారు. గత అక్టోబర్లో కేరళలోని కోజికోడ్ జిల్లాలోని ఫరూఖ్ కాలేజీలో తొమ్మిది మంది బీఏ విద్యార్థులు ఒకే బెంచ్ పైన కూర్చున్నారన్న కారణంగా వారికి కాలేజీ యాజమాన్యం నోటీసులిచ్చింది.
అందులో ఓ విద్యార్థి కళాశాల తీరును ప్రశ్నించడంతో అతన్ని సస్పెండ్ చేశారు. దీంతో విద్యార్థి సంఘాలు రంగంలోకి దిగాయి. ఈ వివాదం హైకోర్టుకు చేరింది. విద్యార్థిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని కోర్టు తీర్పు చెప్పింది. ఇప్పుడు మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై పలువురు మండిపడుతున్నారు.