కావేరీ చిచ్చు: బెంగళూరు నుంచి తమిళనాడుకు వధువు నడక
బెంగళూరు: కావేరీ జల వివాదం నేపథ్యంలో కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బస్సులు, ప్రయివేటు వాహనాలు నడవటం కష్టంగా మారింది. ఈ వివాదం కారణంగా ఓ వధువు కాలినడకన వరుడి ఇంటికి వెళ్లవలసి వచ్చింది.
కావేరీ వివాదం కారణంగా రెండు రాష్ట్రాలలో రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో బెంగళూరుకు చెందిన ప్రేమకు తమిళనాడులోని వనియంబాడిలో బుధవారం ఓ వ్యక్తితో పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్లికి ముందు రోజే అక్కడికి చేరుకోవాలి.
దీంతో వధువుతోపాటు ఆమె కుటుంబం మంగళవారం ఉదయం తమిళనాడుకు బయలుదేరింది. కానీ, తమిళనాడుకు బస్సులు లేవు. దీంతో అవకాశం ఉన్నంత వరకు ఏదో ఒక వాహనాన్ని పట్టుకుని కొద్ది దూరం వెళ్లారు. అక్కడి నుంచి తమిళనాడుకు కాలినకడన బయల్దేరారు.
సంతోషాన్ని కోల్పోతున్నామని, ఈ రోజు మరపురానిదని, ఆరువందల మందిని పెళ్లికి పిలిస్తే కేవలం 20 మందే వస్తున్నారని వధువు ప్రేమ ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనలు సరికావని, మనమంతా భారతీయులమని చెప్పింది. ఆమెతో పాటు కుటుంబ సభ్యులు కూడా పాదయాత్ర మొదలు పెట్టారు.
పెళ్లి దుస్తుల్లో అలంకరించుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వధువు మీడియా కంట పడటంతో ఇది వెలుగు చూసింది. కాగా, కావేరీ జలాలను తమిళనాడుకు విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశంతో కర్ణాటకలో తీవ్ర ఆందోళనలు చెలరేగిన సంగతి తెలిసిందే. దీంతో తమిళనాడులో కర్ణాటక వాహనాలపై, కర్ణాటకలో తమిళ వాహనాలపై దాడులు జరగడంతో ఇరువైపుల నుంచి రవాణా వ్యవస్థ నిలిచిపోయింది.