union budget 2025: TDS పరిమితి రూ. 6లక్షలకు పెంపు.. లాభం ఎవరికంటే..?
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో వ్యక్తిగత ఆదాయపన్నుపై కీలక నిర్ణయం తీసుకుంది.రూ. 12 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయ పన్ను నుంచి మినహాయింపునిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతే కాక అద్దెలపై విధించే TDS వార్షిక పరిమితిని రూ. 2.4లక్షల నుంచి 6 లక్షలకు పెంచుతున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.
టీడీఎస్ ఎలా అమలు చేస్తారు..?
ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 194-ఐ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో సంస్థల మధ్య అద్దె చెల్లింపులు రూ. 2.40 లక్షలు మించితే కిరాయిదారు మూలం వద్దే పన్ను(టీడీఎస్)మినహాయించాల్సి ఉంటుంది. అయితే తాజాగా ఈ పరిమితిని రూ. 6 లక్షలకు (నెలవారీ అయితే రూ.50,000) పెంచుతున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.

ఎవరికి లాభం..?
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వ్యాపార సంస్థలకు భారీ ఊరటగా చెప్పవచ్చు. ప్రస్తుతం వ్యక్తులు, హెచ్ యూఎఫ్ లకు కిరాయి చెల్లింపులు నెలవారీ రూ.50వేలు(వార్షికంగా రూ. 6లక్షలు)మించినప్పుడు 5శాతం టీడీఎస్ అమలవుతోంది. వ్యాపారసంస్థలు/ట్రస్టులు/ఎన్జీఓలు తదితర వర్గాలకు వార్షిక అద్దె రూ.2.4లక్షలు మించినప్పుడే టీడీఎస్ అమలవుతోంది.
ఇప్పుడు వ్యక్తులు, హెచ్ యూఎఫ్ ల మాదిరే సంస్థలకూ టీడీఎస్ అమలు పరిమితిని నెలవారీ అద్దె రూ.50,000లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. మొత్తానికి తక్కువ పన్ను చెల్లించేవారు, భూమి లేదా భవన యజమానులకు ఈ పెంపు ప్రయోజనం కల్పిస్తుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కోటి మందికి నో ట్యాక్స్..
ఆదాయపన్ను మినహాయింపును రూ. 12 లక్షలకు పెంచడం వల్ల దేశవ్యాప్తంగా మరో కోటి మంది ప్రజలు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదని నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. మధ్యతరగతి ప్రజల ప్రయోజనం కోసమే పన్ను రేట్లను తగ్గించినట్లు ఆమె చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications