అస్సాంలో బుల్లి బాయ్ యాప్ క్రియేటర్ నీరజ్ బిష్ణోయ్ అరెస్టు
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన బుల్లిబాయ్ యాప్ కేసులో ఆ యాప్ సృష్టికర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న 21 ఏళ్ల నీరజ్ బిష్ణోయ్ ను ఢిల్లీ పోలీసులు అస్సాంలో పట్టుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి నలుగురు నిందితులు అరెస్టయ్యారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నీరజ్ ఈ కేసులో ప్రధాన నిందితుడు. అతడు గిట్హబ్ ప్లాట్ ఫాంలో ఈ యాప్ రూపొందించినట్లు తెలిపాయి. అలాగే మహిళలకు సంబంధించిన అభ్యంతరకర చిత్రాలు అతడి ట్విట్టర్ ఖాతా నుంచే వచ్చినట్లు పేర్కొన్నాయి.
సోషల్ మీడియా నుంచి సేకరించిన కొందరు మహిళల ఫొటోలను మార్చిన దుండగులు బుల్లీబాయ్ యాప్లో ఉంచారు. వర్చువల్ వేలం కోసం వారి అనుమతి లేకుండానే ఫొటోలు ఆ యాప్లో అప్లోడ్ అవడంపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహజ్వాలలు వ్యక్తమయ్యాయి. ప్రత్యేకంగా ఓ వర్గానికి చెందిన మహిళల చిత్రాలను మాత్రమే ఉంచుతున్నట్లు తేలింది.
కాగా, ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మయాంక్ రావల్(21), విశాల్ కుమార్ ఝా, మరో యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నిందితుల వాంగ్మూలాలున కూడా పోలీసులు నమోదు చేసుకున్నారు.
మరో టెలిగ్రామ్ చానల్ వికృత చేష్టలు ఇలా
బుల్లీ బాయ్ యాప్ కేసు వికృత చేష్టలను మరువకముందే అలాంటి మరో వ్యవహారం వెలుగుచూడటం సంచలనంగా మారింది. కొందరు దుండగులు టెలిగ్రామ్ యాప్లో హిందూ అమ్మాయిల ఫొటోలను షేర్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తక్షణమే ఆ చాణల్ను బ్లాక్ చేసినట్లు ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ వెల్లడించారు.
పోలీసు అధికారులను, రాష్ట్రాలను సమన్వయం చేసుకుంటూ దీనిపై ప్రభుత్వం పనిచేస్తున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. చాలా మంది యూజర్లు సదరు టెలిగ్రామ్ ఛానల్ తమ అనుమతి లేకుండా ఫొటోలను వాడుతున్నట్లు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. బుల్లీ బాయ్ యాప్ కేసును ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆధ్వర్యంలో పర్యవేక్షిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి బుధవారం ముంబైలో 21 ఏళ్ల మయాంక్ రావల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.
ఇప్పటికే ఈ కేసులో విశాల్ కుమార్ ఝా, మరో యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. నిందితుల వాంగ్మూలాలను నమోదు చేసుకున్నారు పోలీసులు. నిందితుడు విశాల్ కు జనవరి 10 తేదీ వరకు పోలీస్ కస్టడీ అనుమతించారు.
Recommended Video
కాగా, ఈ నిందితులను బెంగళూరు, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు, హైదరాబాద్ నగరంలోనూ ఓ మహిళా బాధితురాలు తన ఫొటోలను మార్ఫింగ్ చేసి సదరు యాప్ లో పోస్టు చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.