ఆర్టీసీ బస్సులో ఓటర్లకు రూ.లక్షలు పంచేసిన కండక్టర్: దినకరన్ పని !
చెన్నైలో కదులుతున్న బస్సులో టీటీవీ దినకరన్ కు ఓటు వెయ్యాలని ఆర్ కే నగర్ ఓటర్లకు రూ. లక్షలు పంచి పెట్టిన ఆర్ టీసీ కండెక్టర్ ను పోలీసులు అరెస్టు చేసి రూ. 2 లక్షల విలువైన రూ. 2,000 నోట్లు స్వాధీనం చేసుక
చెన్నై: జయలలిత మరణంలో ఖాళీ అయిన ఆర్ కే నగర్ నుంచి అన్నాడీఎంకే అమ్మ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీటీవీ. దినకరన్ అడ్డంగా బుక్కయ్యారు. ఆయన అనుచరులు వరుసగా అరెస్టు కావడంతో శశికళ వర్గీయులు హడలిపోతున్నారు.
ఆర్ కే నగర్ లో నివాసం ఉంటున్న దినకరన్ అనుచరులతో పాటు ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగి ఎన్నికల అధికారులకు అడ్డంగా చిక్కిపోయారు. చెన్నై ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ ( తమిళనాడు ప్రభుత్వ ఆర్ టీసీ) బస్సులో ఉద్యోగం చేస్తున్న కండెక్టర్ ఓటర్లకు విచ్చలవిడిగా డబ్బు పంచిపెడుతూ రెడ్ హ్యాండెడ్ గా చిక్కిపోయాడు.

తెగించిన ఆర్ టీసీ కండెక్టర్
చెన్నై ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (ఆర్ టీసీ) లో గోవిందరాజ్ కండెక్టర్ గా పని చేస్తున్నాడు. ఇతను చెన్నైలోని రూట్ నెంబర్ 44 సీ లో విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం రాత్రి ఆర్ కే నగర్ లోని తంతియార్ పేట ఏరియాలో బస్సు సంచరిస్తోంది.

అధికారి, ప్రతిపక్షాలకు ఉద్యోగ సంఘాలు
తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే, ప్రత్యక్ష పార్టీ డీఎంకే పార్టీల వర్గాలకు ఉద్యోగ సంఘాల యూనియన్లు ఉన్నాయి. కండెక్టర్ గోవిందరాజు అన్నాడీఎంకే వర్గానికి చెందిన ఉద్యోగ సంఘం యూనియన్ లో ఉన్నారని వెలుగు చూసింది.

విధుల్లోనే రూ. లక్షలు పంచేశాడు
మంగళవారం ఉదయం తంతియార్ పేటలో (ఆర్ కే నగర్ లో అతి పెద్ద ఏరియా) రూట్ నెంబర్ 44 సీ బస్సు వెలుతున్న సమయంలో కండెక్టర్ గోవిందరాజు కదులుతున్న బస్సులోనే స్థానిక ఓటర్లను గుర్తించి టీటీవీ దినకరన్ కు ఓటు వెయ్యాలని ప్రచారం చేస్తూ రూ. లక్షలు పంచిపెట్టేశాడని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు.

రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న స్థానికులు
ప్రయాణికులకు టిక్కెట్లు కొట్టకుండా మీరు ఈ ప్రాంతం వారే కదా తీసుకోండి డబ్బులు, నేను చెప్పిన పేరు గుర్తు ఉంది కదా, మీరు ఓటువెయ్యడం మరిచిపోకండి అంటూ కండెక్టర్ గోవిందరాజ్ స్థానికులకు రూ. 2,000 నోట్లు చకచకా ఇష్టం వచ్చినట్లు పంచేశాడు. అయితే ప్రత్యర్థి పార్టీకి చెందిన ఓటర్లు అతని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

బస్సు సీజ్ చేసిన పోలీసులు
కండెక్టర్ గోవిందరాజ్ విధుల్లో ఉన్న బస్సును నేరుగా వన్నార్ పేట్ పోలీస్ స్టేషన్ దగ్గరకు తీసుకు వెళ్లిన ప్రయాణికులు పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుక్న విజిలెన్స్ అధికారులు, ఎన్నికల కమిషన్ అధికారులు వన్నార్ పేట పోలీస్ స్టేషన్ చేరుకున్నారు.

అధికారుల దిమ్మ తిరిగింది
చెన్నై నగరంలోని సిటీ బస్సుల్లో దాదాపు ఐదారు కిలోమీటర్లు సంచరించినా బస్సు చార్జీ ఐదు రూపాయల కంటే ఎక్కువ ఉండదు. అలాంటిది కండెక్టర్ దగ్గర ఏకంగా రూ. 2 లక్షలకు పైగా ( మొత్తం రూ. 2,000 నోట్లు) ఉండటంతో అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఎవరు ఇచ్చారంటే తిక్క సమాధానం
ఇంత పెద్ద మొత్తంలో డబ్బు నీ దగ్గరకు ఎలా వచ్చింది అంటూ అధికారులు ప్రశ్నిస్తే కండెక్టర్ గోవిందరాజ్ తిక్క తిక్క సమాధానాలు చెప్పడం మొదలు పెట్టాడు. అధికారులకు మండిపోవడంతో బస్సు సీజ్ చేసి కండెక్టర్ బ్యాగ్ లో రూ. 2 లక్షలకు పైగా ఉన్న రూ. 2,000 నోట్లు స్వాధీనం చేసుకుని అతని మీద ఎన్నికల నియమావలి ప్రకారం కేసు నమోదు చేశారు. ఇంత పెద్ద మొత్తంలో కండెక్టర్ దగ్గరకు రూ. 2,000 నోట్లు ఎలా వచ్చాయి అంటూ అధికారులు ఆరా తీస్తున్నారు.

అధికారంలో ఉన్నారనే ధీమాతో మొదటికే మోసం
అధికారంలో ఉన్న వర్గానికి చెందిన యూనియన్ లో ఉన్నానని, కేసు నమోదు అయినా ఎలాగైనా బయటకు రావచ్చనే ధీమాతో గోవిందరాజ్ ఇలా చేసి ఉంటారని అధికారులు అంటున్నారు. అయితే గోవిందరాజ్ అడ్డంగా బుక్కయ్యి ప్రభుత్వ ఉద్యోగానికే ఎసరు తెచ్చుకున్నారు. రూ. రెండు లక్షలకు పైగా రూ. 2,000 నోట్లు ఎలా వచ్చాయి అంటూ గోవిందరాజ్ సమాధానం చెప్పే వరకు అతన్ని వదిలే ప్రసక్తే లేదని వన్నార్ పేట పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications