IIT Madrasలో కుల వివక్ష: ప్రధాని మోదీకి లేఖ రాసిన ప్రొఫెసర్: బ్రాహ్మణ సామాజికవర్గంపై..!!
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకమైన ఐఐటీ మద్రాస్లో కులవివక్ష ఉందని ఫిర్యాదు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు అక్కడి ప్రొఫెసర్ విపిన్ పి. వీటిల్. స్వతంత్ర సంస్థతో ఈ అంశంపై దర్యాప్తు చేపట్టాలని ఆయన లేఖ ద్వారా ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. తాను చేసిన ఆరోపణలపై వెనకబడిన తరగతుల జాతీయ కమిషన్ దర్యాప్తు చేపట్టాలని కోరారు. దర్యాప్తు చేయించకపోతే ఫిబ్రవరి 24వ తేదీ నుంచి తాను ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. కుల వివక్షపై దర్యాప్తు జరిపి క్యాంపస్ పవిత్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటారని భావిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
ఐఐటీ మద్రాస్లో ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ వర్గాల వారికి జరుగుతున్న స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ను ఇక్కడి ఫ్యాకల్టీ రద్దు చేసిందని ప్రొఫెసర్ వీటిల్ లేఖలో పేర్కొన్నారు. అన్ని వివరాలు రుజువులతో సహా సేకరించిన తర్వాతే భారత ప్రభుత్వం విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ లేఖ రాస్తున్నట్లు వీటిల్ లేఖలో తెలిపారు. గతేడాది ఐఐటీ మద్రాసులోని హ్యూమానిటీస్ మరియు సోషల్ సైన్సెస్ డిపార్ట్మెంట్లో తాను ఎదుర్కొన్న కులవివక్షపై నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు తర్వాత ఎన్సీబీసీ ఓ విచారణ కమిటీని నియమించి నిజనిజాలు వెలికి తీయాలని కోరింది.

కేరళకు చెందిన వీటిల్ మనియని సామాజిక వర్గానికి చెందినవారు. ఇది కేరళలో ఓబీసీ కిందకు వస్తుంది. జూలై 2021లో ఇలాంటి కుల వివక్షను ఎదుర్కోవడంతో ఆయన ఐఐటీ మద్రాస్ను వీడారు. ఆ తర్వాత అదే ఏడాది సెప్టెంబర్ నెలలో తిరిగి విధుల్లో చేరారు. అయితే ఈ వివక్ష ఇంకా కొనసాగుతూ ఉండటంతో ఆవేదన చెందిన ప్రొఫెసర్ వీటిల్ మరోసారి రాజీనామా చేశారు. "కుల వివక్షపై పోరాటం చేసినందుకు గాను అప్పటి ఐఐటీ మద్రాస్ డైరెరక్టర్ హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ డైరెక్టర్ నన్ను కులం పేరుతో పలురకాలుగా వేధించారు.
అగ్రకులాలకు చెందిన వారు తక్కువ కులాల వారిని ఒక మనిషిగా చూడరు సరికదా.. వారిని ప్రశాంతంగా ఉండనీయరు. అంతేకాదు మా పని మేమే చేసుకుపోతామంటే కూడా అడ్డంకులు సృష్టిస్తున్నారు" అని వీటిల్ ప్రధాని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. గతేడాది అక్టోబర్లో ఐఐటీ మద్రాస్ వీటిల్ ఆరోపణలపై విచారణ కమిటీని నియమించింది. దర్యాప్తు చేసిన విచారణ కమిటీకి వీటిల్ ఆరోపణలపై ఎలాంటి నిర్దిష్ట రుజువులు లేదా సాక్ష్యాలు లభించలేదు.
Recommended Video
ఫిబ్రవరి 3వ తేదీన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్కు వీటిల్ లేఖరాశారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఫ్యాకల్టీ ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ వర్గాలకు జరుగుతున్న రిక్రూట్మెంట్ను రద్దు చేసేందుకు ఎలాంటి కుట్రపన్నారో లేఖలో వివరించారు. స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ కోసం జారీ చేసిన అడ్వర్టయిజ్మెంట్లో ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ అభ్యర్థులు ఎక్కువగా రాకుండా ఈ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఫ్యాకల్టీ కుట్ర పన్నిందని ప్రొఫెసర్ వీటిల్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications