బాలుడి మరణాన్ని క్షణాల్లో తప్పించిన పోలీస్(వీడియో)
ముంబై: ఆ బాలుడికి భూమ్మీద ఇంకా నూకలున్నాయి. అందుకే క్షణాల్లోనే తన మరణాన్ని తప్పించుకున్నాడు. అందుకు ఓ పోలీస్ కానిస్టేబుల్ సాయమందించాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానేలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. థానేలోని అంబర్నాథ్ అనే రైల్వే స్టేషన్ జనాలతో కిక్కిరిసి ఉంది. అప్పుడే స్టేషన్ వైపు లోకల్ రైలు వేగంగా దూసుకొచ్చింది. అది గమనించని ఓ పిల్లాడు అవతలి ప్లాట్ ఫాం నుంచి ఇవతలి వైపు దూసుకొచ్చాడు. సరిగ్గా ప్లాట్ ఫాం కంటే కొద్ది ఎత్తు మాత్రమే ఉన్న ఆ పిల్లాడు అక్కడేవుండి ఆందోళన చెందాడు.
కాగా, రైలు వేగంగా వస్తోంది. ప్రయాణీకులంతా ఏం జరుగుతుందో అని కంగారు పడిపోతున్నారు. ఇంతలోనే ఓ రైల్వే పోలీసు ఎంతో సాహసంతో ఆ పిల్లాడికి చేయందించాడు. అదే సమయంలో మిగితా ప్రయాణీకులు కూడా అతడిని రక్షించేందుకు కానిస్టేబుల్కు తోడయ్యారు.
సరిగ్గా అతడిని రైలు సమీపించే సమయానికి పైకి లాగారు. దీంతో రెప్పపాటులో ఆ పిల్లాడి ప్రాణం ప్రమాదం నుంచి బయటపడింది. దీంతో రైల్వే కానిస్టేబుల్ సాహసాన్ని అక్కడి ప్రయాణీకులు అభినందించారు. కాగా, ఈ దృశ్యం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డై సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.