మనమంతా మనుషులం: కావేరీ చిచ్చుపై ప్రకాశ్ రాజ్
హైదరాబాద్: కావేరీ నది వివాదం, విధ్వంసం పైన నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. కర్నాటక, తమిళనాడు విధ్వంసాలు చూస్తుంటే బాధగా ఉందని, మనం మనుషులమని, శాంతియుతంగా పోరాడి సమస్యకు పరిష్కారం కనుగొందామన్నారు.
ఇరు రాష్ట్రాలలో కొనసాగుతున్న విధ్వంసం చూస్తుంటే చాలా బాధగా ఉందన్నారు. ఎవరైనా హక్కుల కోసం పోరాడటంలో తప్పు లేదని, కానీ ఆస్తులను ధ్వంసం చేయడం, ఒకరి పైన మరొకరు దాడులు చేసుకోవడం మాత్రం సరికాదన్నారు.
మనమంతా మనుషులమని, శాంతియుతంగా పోరాడుదామని, ఉద్యమం ఎలా చేయాలో భావితరాలకు నేర్పుదామన్నారు. మీ ఆగ్రహాన్ని అర్థం చేసుకోగలమని, కానీ కొంచం శాంతించి అల్లర్లకు స్వస్తి పలుకుదామని హితవు పలికారు. ఎవరూ ఆవేశానికి లోను కావొద్దన్నారు.
ఎప్పుడూ అన్యాయమే: సిద్ధరామయ్య
కావేరీ జలాల అంశంలో తమ రాష్ట్రానికి సుదీర్ఘ కాలంగా అన్యాయం జరుగుతోందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం అన్నారు. నీటి విడుదలపై సుప్రీం కోర్టు తీర్పు కష్టంగా ఉన్నప్పటికీ, న్యాయస్థానం ఆదేశానుసారం ఆరు రోజుల పాటు నీటిని విడుదల చేసినట్లు చెప్పారు.
కన్నడ ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేయొద్దన్నారు. పోలీసుల కాల్పుల్లో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొల్చేందుకు మీడియా సహకరించాలన్నారు. బెంగళూరు కర్ణాటక రాజధాని మాత్రమే కాదని, అంతర్జాతీయ నగరమన్నారు. కావేరీ వివాదంపై ప్రధాని మోడీతో చర్చిచేందుకు అపాయింట్మెంట్ కోరానని, ఆయన సమయం ఇస్తే రేపు కలిసి పరిస్థితిని వివరిస్తానన్నారు. ఏ సమస్యకైనా హింస పరిష్కారం కాదని, ప్రజలందరూ శాంతి, సంయమనంతో ఉండాలన్నారు.