నీరవ్ మోడీ కేసు విచారిస్తున్న ఐపీఎస్ అధికారి త్రిపురకు బదిలీ, ఎందుకంటే?
న్యూఢిల్లీ: నీరవ్ మోడీ కేసు దర్యాప్తు చేస్తున్న త్రిపుర క్యాడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి రాజీవ్ సింగ్ తిరిగి ఆ రాష్ట్రానికి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకొన్నారు. ఈ నిర్ణయంతో ప్రస్తుతం కొనసాగుతున్న కేసుల విచారణపై ఎలాంటి ప్రభావం ఉండదని సీబీఐ అధికారులు ప్రకటించారు.
త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్ వినతి మేరకు కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకొంది. త్రిపుర రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఐపీఎస్ అధికారులు సీబీఐకు డిప్యూటేషన్ పై వెళ్ళారు. రాజీవ్ సింగ్ తో పాటు డిఐజీ అనీష్ ప్రసాద్. ఎస్పీ గోపాలకృష్ణారావులు సీబీఐలో డిప్యూటేషన్ పై పనిచేస్తున్నారు.
రాజీవ్ సింగ్ ప్రస్తుతం నీరవ్ మోడీ కేసును విచారణ చేస్తున్నారు. ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులను రాష్ట్రానికి తిరిగి ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి పలు మార్లు లేఖలు రాశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడేందుకు అవసరమని కోరారు.
మరోవైపు నీనా సింగ్ స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ కు లో పనిచేస్తున్నారు. అతడిని కూడ ఆయన స్వంత రాష్ట్రమైన రాజస్థాన్ కు పంపనున్నారు. నీనాసింగ్ నేతృత్వంలోని టీమ్ గురుగ్రామ్ లోని స్కూల్ లో విద్యార్ధి హత్యతో పాటు కోటైకాయ్ విద్యార్ధి గ్యాంగ్ రే్ప్ ఘటన ను చేధించారు.అంతేకాదు షీనాబోర కేసును కూడ ఆయన కొంతకాలం పాటు పర్యవేక్షించారు.
ఈ రెండు రాష్ట్రాల నుండి వచ్చిన వినతుల మేరకు ఈ అధికారులను సీబీఐ నుండి మే 24 వ తేదిన రిలీవ్ చేసినట్టుగా సీబీఐ వర్గాలు తెలిపాయి.త్రిపుర క్యాడర్ కు చెందిన రాజీవ్ సింగ్ నీరవ్ మోడీ కేసును విచారిస్తున్నారు. అంతేకాదు ఐసీఐసీఐ . వీడియోకాన్ కేసును కూడ విచారిస్తున్నారు.
ఈ నలుగురు ఐపీఎస్ అధికారులను వారి రాష్ట్రాలకు తరలించడం వల్ల ప్రస్తుతం కొనసాగుతున్న విచారణలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఓ సీబీఐ అధికారి అభిప్రాయపడ్డారు.