జీఎస్టీ పరిధిలోకి కరెంటు బిల్లులు- కత్తి నూరుతున్న కేంద్రం: బేస్ పెంపు లక్ష్యం
జీఎస్టీ బేస్ పెంపుదల కోసం ఇకపై నెలవారీ విద్యుత్ బిల్లులు, ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపులను పరిగణనలోకి తీసుకోనున్నట్లు వెల్లడించిన సీబీఐసీ ఛైర్మన్ వివేక్ జోహ్రి
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కౌన్సిల్ ఈ నెల 18వ తేదీన భేటీ కానుంది. ఇది 49వ సమావేశం. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ దీనికి అధ్యక్షత వహించనున్నారు. చివరిసారిగా గత ఏడాది డిసెంబర్ 17వ తేదీన జీఎస్టీ కౌన్సిల్ సమావేశమైంది. దాని తరువాత మళ్లీ ఇప్పుడే భేటీ కానుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో సమర్పించిన నేపథ్యంలో ఏర్పాటు కానున్న ఈ కౌన్సిల్ సమావేశంపై ప్రస్తుతం అందరి దృష్టీ నిలిచింది.

బేస్ పెంపుపై కసరత్తు..
ఈ జీఎస్టీ కౌన్సిల్ అజెండాలో కొన్ని కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశాలు లేకపోలేదు. జీఎస్టీ బేస్ పెంపుదలను మరింత పెంచడంపై ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టింది. దీన్ని పెంచడం వల్ల నెలవారీ జీఎస్టీ వసూళ్లు భారీగా పెరుగుతాయని అంచనా వేస్తోంది. దేశంలో జీఎస్టీ అమలులోకి వచ్చిన తొలి రోజుల్లో నెలవారీ వసూళ్లు 40 నుంచి 50 లక్షల వరకు ఉండేది. బేస్ ను పెంచడం వల్ల ఇప్పుడు 1.4 కోట్ల రూపాయలకు పెరిగింది.

నెలవారీ బిల్లులు..
దీన్ని మరింత విస్తృతం చేయబోతోన్నామని, బేస్ పెంపుదల కోసం మరిన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోబోతోన్నామని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) ఛైర్మన్ వివేక్ జోహ్రి తెలిపారు. జీఎస్టీ బేస్ ను పెంచడానికి ఇంకా అనేక అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. బేస్ ను పెంచడానికి నెలవారీ విద్యుత్ బిల్లులు, ఆస్తి పన్నులు చెల్లింపుల డేటాను పరిగణనలోకి తీసుకోబోతోన్నామని ఆయన తెలిపారు.

బేస్ పెంపు వల్లే..
అన్ని రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా కంపెనీల నుంచి దీనికి సంబంధించిన నెలవారీ డేటాను స్వీకరిస్తామని, స్థానిక సంస్థల నుంచి ఆస్తి పన్ను చెల్లింపుల వివరాలను తీసుకుంటామని వివేక్ జొహ్రీ చెప్పారు. నెలవారీ జీఎస్టీ వసూళ్లను భారీగా పెంచుకోవాలనుకుంటే బేస్ ను సవరించక తప్పదని వివరించారు. దీనివల్లే జీఎస్టీ అమల్లోకి వచ్చిన తొలి రోజుల్లో 40 నుంచి 50 లక్షల రూపాయల వరకు ఉన్న రెవెన్యూ ఇప్పుడు 1.4 కోట్ల రూపాయలకు పెరిగిందని గుర్తు చేశారు.

జీఎస్టీ పన్నులు మరింత విస్తృతం..
జీఎస్టీ పన్ను చెల్లింపుదారుల సంఖ్య చాలా తక్కువగా ఉందని, తాము శాస్త్రీయ బద్ధంగా పెంచాలనుకుంటున్నట్లు వివేక్ జొహ్రీ తెలిపారు. పాన్ కార్డ్ ను జాయింట్ బిజినెస్ ఐడెంటిఫయర్ గా గుర్తిస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారని, ఈ చర్య జీఎస్టీ బేస్ పెంచుకోవడానికి మరింత సహకరిస్తుందని వ్యాఖ్యానించారు. విద్యుత్ పంపిణీ సంస్థలతో పాటు ఆస్తి పన్ను డేటాను కూడా ఉపయోగిస్తామని ఆయన తేల్చి చెప్పారు.

రసీదులు ఇవ్వకుంటే..
కమర్షియల్, రెసిడెన్షియల్ కేటగిరీల్లో పన్నులు చెల్లింపులు జరుగుతున్నాయని, పెద్ద నగరాల్లో కమర్షియల్ ట్యాక్స్ చెల్లింపులకు సంబంధించిన డేటాను పరిగణనలోకి తీసుకోగలిగితే- జీఎస్టీ పన్ను చెల్లింపుదారుల సంఖ్య మరింత పెరగొచ్చని వివేక్ జొహ్రీ స్పష్టం చేశారు. రోజువారీ విక్రయాల సంఖ్య లక్షల్లో ఉన్నప్పటికీ రసీదులు ఇవ్వకుండా నగదు రూపంలో వ్యాపారం చేస్తోన్న బిజినెస్-టు-కన్స్యూమర్ (బి2సి) దుకాణదారులు కూడా కొత్తగా దీని పరిధిలోకి వస్తారని చెప్పారు.












Click it and Unblock the Notifications