త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ? ముహూర్తం కూడా ఖరారైందా? టీడీపీకి మరో చాన్స్?
త్వరలోనే కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరగనున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాబోయే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలను నేపథ్యంలో మంత్రి వర్గంలో మార్పులు చోటు చేసుకోబోతున్నట్లు సమాచారం.
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగనుందా? కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రివర్గంలో చేరబోతున్నారా? కొంతమంది కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులుగా, గవర్నర్లుగా వెళ్లబోతున్నారా?
ఈ ప్రశ్నలకు 'అవును' అనే సమాధానం వినిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ తన టీంలో కొన్ని మార్పులు చేయవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ముందు జరిగే చివరి మంత్రి వర్గ విస్తరణ కూడా ఇదే కానుందని, ఈసారి కేంద్ర మంత్రివర్గంలో కీలకమైన మార్పులు జరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
జూన్, జూలై నెలల్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవుల కోసం పెద్దఎత్తున కసరత్తు చేయాల్సి ఉన్నందున ఈలోగా పార్టీలో, ప్రభుత్వంలో భారీగా మార్పులు తీసుకురావాలని భావిస్తున్న ప్రధాని దానికి తగ్గట్టుగా పావులు కదుపుతున్నారని సమాచారం. కేబినెట్ విస్తరణపై మిత్రపక్షాలు కూడా గంపెడాశతో ఉన్నాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మిత్రపక్షమైన శివసేన మద్దతు పొందేందుకు ఆ పార్టీకి చెందిన వారికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
ముహూర్త తేదీ నిర్ణయించారా?
అంతేకాదు, మంత్రి వర్గ విస్తరణకు ప్రధాని మోడీ ముహూర్త తేదీని కూడా నిర్ణయించారని, ఈనెల 27న క్యాబినెట్ విస్తరణ జరగొచ్చని అంటున్నారు. కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులుగా వెళ్లే అవకాశాలున్నట్లు వార్తలు వినవస్తున్నాయి. అదేసమయంలో కొంతమంది మంత్రులను ముఖ్యమంత్రులుగా, గవర్నర్లుగా పంపించే యోచన చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
రక్షణ శాఖకు పూర్తిస్థాయి మంత్రి...
ఇప్పటికే గోవా ముఖ్యమంత్రిగా మనోహర్ పారికర్ బాధ్యతలు స్వీకరించడంతో.. ఇన్నాళ్లూ కేంద్రంలో ఆయన నిర్వహించిన రక్షణ శాఖ బాధ్యతలను తాత్కాలికంగా ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి అప్పగించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మంత్రి వర్గ విస్తరణలో భాగంగా రక్షణ శాఖకు పూర్తిస్థాయి మంత్రిని నియమించడంతోపాటు కీలక శాఖల్లో కొన్ని మార్పులు చేయాలని కూడా ప్రధాని మోడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
విదేశాంగ మంత్రిగా వసుంధరా రాజే?
విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ను ఆ స్థానం నుంచి తప్పించనున్నట్లు తెలుస్తోంది. పార్టీలోని అత్యంత సీనియర్లలో ఒకరైన సుష్మ అనారోగ్యం దృష్ట్యా ఆమె మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించే పరిస్థితి లేదని.. అందుకే ఆ శాఖను రాజస్థాన్ సీఎం వసుంధరా రాజేకు ఇవ్వనున్నట్లు సమాచారం.
తమిళనాడు గవర్నర్ గా సుష్మా...
కేంద్ర మంత్రులకు సంబంధించిన మార్పుల జాబితాలో విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పేరు ముందు వరుసలో ఉన్నట్లు సమాచారం. ఇటీవల కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న సుష్మా స్వరాజ్ ను తమిళనాడులాంటి పెద్ద రాష్ట్రాలకు గవర్నర్గా పంపితే బావుంటుందని ఆరెస్సెస్ నేతలు సూచించగా దానికి మోదీ ఆమోదం తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది.
రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఓం మాథూర్...
రాజస్థాన్ సీఎం వసుంధరా రాజేను ఢిల్లీకి తీసుకొచ్చినట్లయితే ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత ఓం మాథూర్ను నియమించాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయించినట్లు సమాచారం.
పోర్టుఫోలియోల్లో మార్పు...
కొంతమంది కేంద్ర మంత్రుల పోర్టుఫోలియోల్లో కూడా మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు ఆర్థిక శాఖ ఇవ్వాలని, ఇప్పటి వరకు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన అరుణ్ జైట్లీకి రక్షణ శాఖ కట్టబెట్టాలని ప్రధాని మోడీ యోచిస్తున్నట్లు చెబుతున్నారు.
ఏపీకి మరో మంత్రి పదవి?
కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో ఏపీకి సంబంధించి తెలుగుదేశం పార్టీకి మరో మంత్రిపదవి దక్కే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ నుంచి అశోక్గజపతిరాజు, సుజనా చౌదరి కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు. ఈసారి బీసీ వర్గానికి చెందిన తెలుగుదేశం ఎంపీ ఒకరు... తనకు మంత్రి పదవి లభిస్తుందని ధీమాగా ఉన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మేరకు తమకు హామీ కూడా ఇచ్చారని ఆ ఎంపీ తెలిపారు. కాపు సామాజిక వర్గానికి చెందిన మరో ఎంపీ కూడా మంత్రి పదవి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.