లారీ, ట్రక్ డ్రైవర్లకు గుడ్న్యూస్ చెప్పిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ప్రధాన నరేంద్ర మోడీ దేశంలోని ట్రక్, లారీ, టాక్సీ డ్రైవర్లకు శుభవార్త చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2024లో ఆయన పాల్గొని మాట్లాడారు. ట్రాక్, టాక్సీ డ్రైవర్ల కోసం కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల వెంబడి ఆధునిక సౌకర్యాలతో కొత్త భవనాలను నిర్మించనున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు.
లక్షలాది ట్రక్ డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు మన సామాజిక, ఆర్థిక వ్యవస్థలో అంతర్భాగంగా ఉన్నారని, వారు తరచూ చాలా గంటలపాటు పనిచేస్తారన్నారు. అయితే, వారికి విశ్రాంతి తీసుకునే అవకాశం ఉండకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాల బారిన పడుతుంటారని ప్రధాని తెలిపారు.

అయితే, దూర ప్రయాణాలు చేస్తున్న డ్రైవర్లు సరైన విశ్రాంతి తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం చొరవతీసుకుంటుందని తెలియజేశారు. అన్ని జాతీయ రహదారులపై ఆహారం, నీరు, వాష్రూమ్స్, పార్కింగ్, విశ్రాంతి గదులతో మెరుగైన సౌకర్యాలతో ఆధునిక భవనాలు నిర్మిస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు. ఈ ప్రణాళిక తొలిదశలో దేశ వ్యాప్తంగా 1000 భవనాలను నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు.
కాగా, గత నెలలో ట్రక్, టాక్సీ డ్రైవర్లు కొత్తగా తెచ్చిన క్రిమినల్ కోడ్ భారతీయ న్యాయ సంహితలోని హిట్ అండ్ రన్ చట్టం కింద శిక్షలను పెంచడాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు చేసిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆందోళనలు నిర్వహించారు. వీరికి కొన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు పలికాయి. అయితే, ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ని సంప్రదించిన తర్వాతే కొత్త చట్టాలను తీసుకొస్తామని కేంద్ర హోంమంత్రిత్వశాఖ హామీ ఇవ్వడంతో డ్రైవర్లు ఆందోళన విరమించారు.












Click it and Unblock the Notifications