రాడిసన్ బ్లూ హోటల్ కేంద్రంగా: శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు కేంద్రం గుడ్న్యూస్
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం రోజురోజుకూ ముదురుతోంది. శివసేన తిరుగుబాటు వర్గానికి బలం పెరుగుతోంది. తిరుగుబాటు వర్గానికి నాయకత్వాన్ని వహిస్తోన్న ఏక్నాథ్ షిండే వైపు మరికొందరు ఎమ్మెల్యేలు మొగ్గు చూపుతున్నారు. అస్సాం గువాహటిలోని రాడిసన్ బ్లూ హోటల్ కేంద్రంగా మహారాష్ట్ర రాజకీయాలు సాగుతున్నాయి. ఏక్నాథ్ షిండే సహా తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఇక్కడే మకాం వేశారు.
అధికార మహా వికాస్ అగాఢీ సంకీర్ణ కూటమి భాగస్వామ్య పార్టీలు శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ- కాంగ్రెస్ సీనియర్ నాయకులు తమ ఎమ్మెల్యేలతో మంతనాలు సాగిస్తున్నారు. ఏక్నాథ్ షిండే వైపు మొగ్గు చూపకుండా నిలువరిస్తున్నారు. మరోవంక- శివసేన తిరుగుబాటు శాసన సభ్యులపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. శివసేన నాయకులు, కార్యకర్తలు వారి కార్యాలయాలపై దాడులు సాగిస్తోన్నారు. దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తోన్నారు. వారి ఆస్తులను ధ్వంసం చేస్తోన్నారు.
మహారాష్ట్ర వ్యాప్తంగా ఈ దాడులు చోటు చేసుకుంటోన్నాయి. తిరుగుబాటు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాడులతో అట్టుడుకుతోంది. ముంబైలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దాడులను అరికట్టడానికి నియోజకవర్గాల స్థాయిలో పోలీసులు కఠిన ఆంక్షలను అమలు చేస్తోన్నారు. ఈ ఘటనలకు పాల్పడిన పలువురు శివసేన నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ పరిణామాల మధ్య కేంద్ర ప్రభుత్వం తిరుగుబాటు ఎమ్మెల్యేకు భద్రత కల్పించింది. వారికి వై ప్లస్ సెక్యూరిటీని కల్పించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. సాయుధులైన కేంద్రీయ రిజర్వ్ పోలీస్ బలగాలతో భద్రతను మంజూరు చేసింది. తిరుగుబాటును లేవనెత్తిన ఎమ్మెల్యేల్లో 15 మందికి మాత్రమే ఈ భద్రతను కల్పించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయనే ఉద్దేశంతోనే వారికి మాత్రమే సెక్యూరిటీ కల్పించినట్లుగా చెబుతున్నారు.
వై ప్లస్ సెక్యూరిటీని కల్పించిన వారిలో రమేష్ బోర్నరె, మంగేష్ కుడల్కర్, సంజయ్ షిర్సత్, లతాబాయి సొనావనె, ప్రకాష్ సుర్వె, సదానంద్ సరనవ్కర్, యోగేష్ దాదా కదమ్, ప్రతాప్ సర్నాయిక్, యామిని జాదవ్, ప్రదీప్ జైస్వాల్, సంజయ్ రాథోడ్, దాదాజి భుసె, దిలీప్ లండే, బాలాజీ కల్యానర్, సాందీపన్ భుమారె ఉన్నారు. వారికి తక్షణమే ఆర్మ్డ్ సీఆర్పీఎఫ్ జవాన్లతో కూడిన వై ప్లస్ సెక్యూరిటీ అందుతుందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తన ఉత్తర్వుల్లో తెలిపింది.