ముంబై: మళ్లీ అదే దృశ్యం... రైల్వే స్టేషన్లకు పోటెత్తిన వలస కార్మికులు.. సెంట్రల్ రైల్వే కీలక ప్రకటన..
గతేడాది లాక్డౌన్ ఆంక్షలు సడలించి వలస కార్మికుల కోసం స్పెషల్ ట్రైన్స్ నడిపిన సమయంలో... వేలాది మంది కార్మికులు రైల్వే స్టేషన్ల ముందు ఎంతలా బారులు తీరారో చూశాం. ముంబైలో ఇప్పుడదే దృశ్యం మళ్లీ కనిపిస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల పాటు జనతా కర్ఫ్యూ విధించడంతో నగరంలోని వలస కార్మికులంతా స్వస్థలాల బాట పట్టారు. ఈ నేపథ్యంలో వేలాది మంది వలస జీవులు లోక్మాన్య తిలక్ టెర్మినస్,ఛత్రపతి శివాజీ టెర్మినస్ల వద్ద బారులు తీరారు.
పోటెత్తిన వలస కార్మికులు...
వలస కార్మికులంతా ఇలా ఒక్కసారిగా రైల్వే స్టేషన్లకు పోటెత్తుతుండటంతో సెంట్రల్ రైల్వే కీలక ప్రకటన చేసింది. అనవసర భయాందోళనను వీడాలని... రైల్వే స్టేషన్లలో గుంపులు గుంపులుగా చేరవద్దని విజ్ఞప్తి చేసింది. లోక్మాన్య తిలక్ టెర్మినస్ వద్ద భారీ జనసందోహాన్ని అదుపు చేసేందుకు ఆర్పీఎఫ్తో పాటు రైల్వే పోలీసులను అక్కడ భారీగా మోహరించారు.ముంబైలో జనతా కర్ఫ్యూ ఎఫెక్ట్తో ప్రభుత్వ,ప్రైవేట్ సంస్థలు 15 రోజుల పాటు మూతపడనున్నాయి. దీంతో చాలామంది వలస కార్మికులు బతుకు దెరువు లేక మళ్లీ స్వగ్రామాలకు వెళ్తున్నారు. రోజు వారీ కూలీ పనులు చేసుకునేవారికి మళ్లీ గడ్డు కాలం వచ్చిందని వాపోతున్నారు.
గంటలకొద్దీ నిరీక్షణ...
ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ధారావిలో చాలామంది వలస కార్మికులు అద్దెకు నివసిస్తుంటారు. వారిలో చాలామంది ఇప్పుడు మళ్లీ స్వస్థలాలకు కదులుతున్నారు. అయితే వేలాది మంది జనం ఒక్కసారిగా నగరాన్ని వీడుతుండటంతో ప్రస్తుతం ఉన్న రైళ్లు సరిపోయేలా లేవు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లేమీ చేయకపోవడంతో రైల్వే స్టేషన్ల వద్దే వలస కార్మికులు గంటల కొద్దీ నిరీక్షిస్తున్నారు. ఇలా ఇంతమంది జనం ఒకేచోట గంటలకొద్ది ఉంటే కరోనా వ్యాప్తి పెరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
జనతా కర్ఫ్యూ ఎఫెక్ట్...
మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే మంగళవారం(ఏప్రిల్ 13) జనతా కర్ఫ్యూ ప్రకటించిన సంగతి తెలిసిందే. అత్యవసర సర్వీసులు మినహా మిగతా అన్నింటినీ రద్దు చేశారు. ప్రభుత్వ,ప్రైవేట్ కార్యాలయాలు 15 రోజుల పాటు తెరుచుకోవని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్ల సెక్షన్ 144 విధించారు. రాత్రిపూట 8గంటల నుంచి ఉదయం 7గంటల వరకూ కర్ఫ్యూ అమలులో ఉంటుందని తెలిపారు. సీఎం నుంచి జనతా కర్ఫ్యూ ప్రకటన రాగానే వేలాది మంది వలస కార్మికులు రైల్వే స్టేషన్లకు పోటెత్తారు. అంతమంది జనాన్ని ఎలా అదుపు చేయాలో తెలియక అధికారులు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు.