గ్రామీణ ప్రాంతాల్లో కరోనా ఉధృతి: కేంద్రం కీలక మార్గదర్శకాలు విడుదల
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్లో పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ కరోనా మహమ్మారి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దేశంలోని చాలా గ్రామీణ ప్రాంతాల్లో పాజిటివిటీ రేటు 30 శాతం కంటే ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో కేంద్రం తాజాగా, కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించి, ఆరోగ్య సౌకర్యాలను మరింతగా మెరుగుపర్చాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాలు జారీ చేశారు.
Recommended Video
ఈ నేపథ్యంలో కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కంటైన్మెంట్ జోన్లు, నిర్వహణతోపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను పెంచుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర అనారోగ్యం, శ్వాస సమస్యలపై నిఘా పెట్టాలన్నారు.
ర్యాపిడ్ పరీక్షలపై ఏఎన్ఎం, సీహెచ్వోలకు శిక్షణ ఇవ్వాలని, అన్ని ప్రజారోగ్య కేంద్రాల్లోనూ కరోనా పరీక్ష కిట్లు అందుబాటులో ఉంచాలన్నారు. కరోనా బాధితులందరికీ హోం ఐసోలేషన్ కిట్లు అందించాలని తెలిపింది. కేసుల సంఖ్య, వైరస్ తీవ్రతను బట్టి కాంటాక్ట్ ట్రేసింగ్ తప్పనిసరిగా చేయాలని పేర్కొంది. ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు, వాలంటీర్ల ద్వారా స్థానిక సేవలను విస్తృతం చేయాలని పేర్కంది.
ఆశా, ఆరోగ్య కార్యకర్తలతో కరోనా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని పేర్కొన్నారు. కరోనా లక్షణాలున్నవారికి ప్రాథమిక వైద్య సిబ్బందితో టెలిమెడిసిన్ వైద్య సేవలందించాలన్నారు. కరోనా సోకినవారిలో ఇతర ఆరోగ్య సమస్యలున్నట్లయితే వారిని జనరల్ ఆస్పత్రికి తరలించాలని సూచించారు. కరోనా బాధితులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
రోగుల ఆక్సిజన్ స్థాయిలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ఆక్సిజన్ స్థాయిలో వారిని ఆస్పత్రులకు తరలించాలని కేంద్రం పేర్కొంది. గ్రామాల్లో సరిపడా పల్స్ ఆక్సీమీటర్లు, ధర్మా మీటర్లను అందుబాటులో ఉంచాలని, ఆక్సీమీటర్లు వాడిన ప్రతిసారి వాటిని శానిటైజ్ చేయాలని తెలిపింది. దాదాపు 85 శాతం మందిలో కరోనా లక్షణాలు స్వల్పంగానే ఉంటున్నాయని, ఇలాంటివారు హోం ఐసోలేషన్లో చికిత్స పొందాలని తెలిపింది.