అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి: మోడీకి తగ్గని ప్రజాదరణ, కానీ.. సర్వే
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ హవా తగ్గిందని విపక్షాలు విమర్శలు గుప్పించాయి. అయితే, ప్రధాని మోడీగురించి ఢిల్లీ ఓటర్లు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి ఎన్నికలు ముగిశాక సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ అనే సంస్థ సర్వే నిర్వహించింది.
ప్రతి ముగ్గురిలో ఇద్దరు కేంద్రం, మోడీ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. 24 నియోజకవర్గాల్లోని 120 ప్రాంతాల్లో మొత్తం 2060 మంది అభిప్రాయాలను సేకరించారు. ప్రధాని మోడీ చెప్తున్న 'మంచి రోజులు వస్తాయి'పై ఢిల్లీవాసుల్లో ఆశలు సజీవంగా ఉన్నాయి. ఈ విషయంలో 58 శాతం ప్రజలు మోడీని విశ్వసిస్తున్నారు.

49 శాతం పేదలు, 41 శాతం ఎగువ మధ్య తరగతి/సంపన్నులు కూడా మోడీ పట్ల విశ్వాసంతోనే ఉన్నారు. కిరణ్ బేడీ నాయకత్వానికి కూడా బీజేపీ సంప్రదాయ మద్దతుదారుల్లో 60 శాతం, మొత్తం ప్రజల్లో 63 శాతం మద్దతు లభించింది. కానీ పరిపాలన శైలి, ఆర్థిక అంశాల ద్వారానే కేజ్రీవాల్ ఢిల్లీవాసుల మద్దతు సాధించగలిగారు.
ఈ విషయాల్లో మోడీకి కూడా ప్రజల మద్దతు బాగానే ఉన్నా ఢిల్లీ స్థాయిలో జరిగిన ఎన్నికల్లో కేజ్రీవాల్కే మద్దతు అధికంగా ఉంది. గత ఏడెనిమిది నెలల్లో ఆహార ఉత్పత్తుల ధరలు పెరిగాయని 56 శాతం ప్రజలు చెప్పారు.
ఈ అధిక ధరలు ఎక్కువగా పేదలు(72), అల్పాదాయ వర్గాల(60)తోపాటు మధ్యతరగతి(52), సంపన్న వర్గాల(46)పైనా ప్రభావం చూపాయి.
కేజ్రీవాల్ 49 రోజుల పాలనపై 72 శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. మోడీ ప్రధానిగా కేంద్ర ప్రభుత్వ పనితీరుపై 66 శాతం సంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్థిక విషయాల్లో కేజ్రీవాల్ పనితీరుపై అన్ని ఆర్థిక తరగతుల ప్రజలు సగటున 72 శాతం సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే విషయంలో మోడీకి సగటున 62.5 శాతం మద్దతు లభించింది.












Click it and Unblock the Notifications